బెంగుళూరు లో సీఏఏ కు వ్యతిరేకంగా మజ్లీస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల ఒక బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సభలో అమూల్య లియోని అనే యువతి పాకిస్థాన్ కు అనుకూలంగా పాకిస్థాన్ జిందా బాద్ అంటూ ఆమె చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి.
సభలో మాట్లాడుతున్న అమూల్య ఉన్నట్టుండి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది.అయితే ఆమెను ఆపడానికి అటు అసదుద్దీన్,ఇతర కార్యకర్తలు ప్రయత్నించినప్పటికీ ఆమె ఏ మాత్రం ఆగలేదు.
అయితే పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన అమూల్య పై శ్రీరామసేన కార్యకర్త సంజీవ్ మరాడి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమెను చంపితే రూ.10 లక్షల నజరానా ఇస్తామంటూ మరాడి వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా,అమూల్య జైలు నుంచి విడుదల చేయకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
ఒకవేళ ఆమెను విడుదల చేసినా కాల్చి చంపేస్తాం అంటూ ఆయన హెచ్చరించారు.అయితే సంజీవ్ మరాడి వ్యాఖ్యలపై మానవహక్కుల సంఘాలు తీవ్రంగా స్పందించాయి.ఆయన వ్యాఖ్యలను ఖండించిన మానవహక్కుల సంఘాలు మరాడీపై బళ్లారి ఎస్పీ సి.కె.బాబాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.సీఏఏ వ్యతిరేక సభలో పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేయడంతో అమూల్యపై దేశద్రోహం కేసు నమోదు కాగా అరెస్ట్ కూడా చేశారు.
ఐపీసీ సెక్షన్ 124ఏ కింద అమూల్యపై దేశద్రోహం కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు.అమూల్యను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించి, శుక్రవారం ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టారు.గతంలో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలోనూ అమూల్యను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.మరోపక్క అమూల్య వ్యాఖ్యలపై ఆమె తండ్రి కూడా తీవ్రంగా మండిపడ్డారు.ఆమె చేసింది తప్పని, తన మాటలు వినకుండా కొందరు ముస్లింలతో చేరిందని, ఆమెకు బెయిల్ కోసం కూడా తాను ఎలాంటి ప్రయత్నాలు చేయబోనంటూ స్పష్టం చేశారు.