జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆయనకు అత్యంత సన్నిహితుడు గా ముద్రపడి, నిన్న పార్టీకి రాజీనామా చేసిన రాజు రవితేజ మరోసారి సంచలనాత్మకమైన విమర్శలు చేశారు.శనివారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
సమాజానికి పట్టిన వ్యాధిని నివారించాలని మనం ప్రజాజీవితంలోకి ప్రవేశించాము, కానీ ఆ వ్యాధిగా మీరు మారరు అంటూ పవన్ పై విమర్శలు చేశారు.పన్నిండు ఏళ్ల పాటు మీ వెంట నడిచాను.
పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు మీతో చర్చించాను, పార్టీ కోసం ఎంతో చేశారు.మరి ఎంతో చేద్దాం అనుకున్నాము ,కానీ మీరు రాజకీయాలు విషపూరితంగా మార్చి అబద్దాలతో మీ వ్యక్తిగత అహంకారాన్ని సంతృప్తి పరుచుకుంటారు.
మీరు చేసే ప్రసంగాలు అబద్ధాలు, అసభ్యకరమైన భాషలో ఉంటున్నాయి.మీరు ఎప్పటికీ ధర్మ వంతమైన మనిషి కాలేరు, ఒక మంచి మనిషి నుంచి నిజాయితీ లేని కుట్రపూరితమైన మనిషి గా మారారు అంటూ విమర్శలు చేశారు.
అసలు జనసేన క్షేత్రస్థాయిలో లేదని, పార్టీలో అంతర్గత పారదర్శకత అసలే లేదని ఆయన విమర్శించారు.పవన్ సొంత పార్టీ వాళ్ళను పైకి రాకుండా చేస్తున్నారని, పార్టీ వేదికను ఆయన తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయిన తరువాత పార్టీలోని సీనియర్ నాయకులంతా ఆనంద పడ్డారు అని రాజు రవితేజ గుర్తు చేశారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భాష పూర్తిగా మారిపోయిందని, ఇది సమాజానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
మతాల గురించి పవన్ మాట్లాడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదు అంటూ ఆయన సూచించారు.