రాజోలు రాజకీయం పై ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది.అధికార పార్టీ వైసీపీ లో చాలాకాలం నుంచి వర్గ విభేదాలు ఉన్నా, అవి ఇప్పుడు ముదిరి పాకాన పడినట్టు గా కనిపిస్తున్నాయి.2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు అక్కడ బిజీగా ఉండగా , ఆ తర్వాత కోఆర్డినేటర్ గా మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజిని నియమించారు.దీంతో అమ్మాజీ, బొంతు రాజేశ్వరరావు వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడిచింది.ఈ వ్యవహారంతో ఇరు వర్గాలు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నారు.అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో బొంతు రాజేశ్వరరావు పూర్తిగా సైలెంట్ అయ్యారు.
ఇక ఆ తర్వాత జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసిపికి అనుబంధంగానే వ్యవహరిస్తున్నారు.బహిరంగంగానే వైసీపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడుతూ, జగన్ పరిపాలన ను మెచ్చుకుంటున్నారు.
దీంతో జగన్ రాపాక వరప్రసాద్ కు బాగానే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.దీంతో అమ్మజి రాపాక కు చెక్ పెట్టే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టడం , రాపాక తో విభేదించే వారికి కీలక పదవులు కట్టబెడుతూ వస్తుండడం తదితర కారణాలతో అమ్మాజీ రాపాక వరప్రసాద్ మధ్య అంతర్గత విభేదాలు ముడురుతూ వస్తున్నాయి.
అదే సమయంలో మాజీ వైసీపీ ఇన్ చార్జ్ బొంతు రాజేశ్వరరావు గ్రామీణ నీటి సరఫరా సలహా కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం దక్కడంతో , ఇప్పుడు ఆయన యాక్టివ్ అయ్యారు.ఆయనకు దూరంగా ఉంటూ వచ్చిన కార్యకర్తలు , ముఖ్య నాయకులు చాలామంది రాజేశ్వర వర్గంలో చేరడంతో ఇక్కడ పరిస్థితి మూడు ముక్కలాటగా తయారయింది.
మలికిపురం ఎస్ఐలను బదిలీ చేయించేందుకు రాపాక ప్రయత్నించడం, దానికి అమ్మాజి అడ్డుపడడం, నామినేటెడ్ పోస్టులలో గతంలో ఉన్న జనసేన కు చెందిన వారికి ప్రాధాన్యమివ్వడం, తదితర కారణాలతో వీరి మధ్య విబేధాలు మరింతగా పెరిగిపోయాయి.నామినేటెడ్ పదవి దక్కించుకున్న బొంతు రాజేశ్వరరావు అధికారులపై అజమాయిషీ చేస్తున్న వ్యవహారం పైనా ఫిర్యాదులు అధిష్టానానికి చేరాయి.దీంతో రాపాక , అమ్మజీ, రాజేశ్వరరావు వ్యవహారాన్ని ఏ విధంగా పరిష్కరించాలనే విషయంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది.రాజోలు లో రాజుకున్న ఈ రాజకీయ చిచ్చుని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.