సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ రజినీకాంత్ కూతురుగా నటిస్తుంది.మీనా, కుష్బూ రజినీకాంత్ కి జోడీగా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే గత ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడిపోయింది.
కరోనా నుంచి కుదుటపడి మరల షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత గత డిసెంబర్ లో అన్నాత్తై షూటింగ్ స్టార్ట్ చేశారు.ఒక పది రోజులు షూటింగ్ జరిగిన తర్వాత సడెన్ గా చిత్ర యూనిట్ లో కొంత మందికి కరోనా వచ్చింది.
అదే సమయంలో రజినీకాంత్ కి కూడా ఆరోగ్యం దెబ్బతినడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.బీపీ డౌన్ అయిందని, రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
డిసెంబర్ లోనే రజినీకాంత్ పార్టీ పెట్టి తమిళ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ కూడా చేయాలని అనుకున్నారు.
ఇక ఆరోగ్య సమస్యలు, కుటుంబం ఒత్తిడి నేపధ్యంలో రాజకీయ పార్టీ పెట్టలేనని తనను అభిమానులు క్షమించాలని రజినీకాంత్ ఒక ఓపెన్ లెటర్ ద్వారా చెప్పేశారు.
తరువాత ఇంటికే పరిమితం అయిపోయారు.ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్ళీ సినిమా షూటింగ్ లపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు.ఈ నేపధ్యంలో షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలని దర్శకుడు శివకి రజినీకాంత్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.గ్యాప్ లేకుండా సింగిల్ షెడ్యూల్ లో రెగ్యులర్ షూటింగ్ తో మొత్తం పూర్తి చేసే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేయాలని చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమా పూర్తికాగానే కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాజినికాంట్ నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.