మొన్నటి వరకు తమకు అధ్యక్షుడు గా ఉన్న సీఎం కేసీఆర్ అంటే భయం భక్తులు ప్రదర్శించేవారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.ఎప్పుడైతే తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారో అప్పటి నుంచి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
అవకాశం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ ప్రభుత్వం పై అనేక ప్రశ్నలు సంధిస్తూ, కెసిఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.దీనికి తగ్గట్లుగానే టిఆర్ఎస్ ఈటల రాజేందర్ నియోజకవర్గమైన హుజురాబాద్ ఆయనను ఒంటరి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గానే రాజేందర్ తీసుకున్నారు.దీనిలో భాగంగానే ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన రాజేందర్ టిఆర్ఎస్ ప్రభుత్వం పై అనేక విమర్శలు చేశారు.
కేసీఆర్ తీరును తప్పుపడుతూ అనేక ప్రశ్నలు సంధించారు.టిఆర్ఎస్ కుట్రలను హుజురాబాద్ ప్రజలు తిప్పికొడతారని , నాయకుడు అంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని రాజేందర్ అన్నారు.
ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి టిఆర్ఎస్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.ఎక్కడైనా ఉప ఎన్నిక వచ్చిందంటే చాలు కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తూ ఉంటారు అంటూ మండిపడ్డారు .ఇక తెలంగాణలో నిరుద్యోగ భృతి ఎప్పుడో ఇస్తారని ప్రకటించారని అది ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.తన రాజీనామాతో కెసిఆర్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారని, అలాగే రెండేళ్లుగా నిలిచిపోయిన రేషన్ కార్డులు, పెన్షన్లు వెంటనే ఇవ్వాలని, 50 ఏళ్లు నిండిన వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని, హుజూరాబాద్ నియోజకవర్గం లోని వావిలాల, చల్లూరు లను కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని, హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటించాలని రాజేందర్ డిమాండ్ చేశారు.
ఎక్కడ ఉప ఎన్నికల్లో వచ్చినా, కేసీఆర్ అక్కడ నిధులను కేటాయిస్తారు అని , అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు అని, అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.చిన్న గ్రామాలకు 50 లక్షలు, పెద్ద గ్రామాలకు కోటి రూపాయలు వెంటనే మంజూరు చేయాలని కోరారు.గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్టుగా కొంతమంది వ్యవహరిస్తూ పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నారు అని మండిపడ్డారు.నంగనాచి మాటలతో నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతున్నారని, రాజభక్తి చాటుకుంటూనే చాటుకోండి కానీ తన జోలికి వస్తే ఊరుకోను అంటూ హెచ్చరించారు.
ప్రభుత్వం ప్రకటించే తాయిలాలకి ఈ నియోజకవర్గ ప్రజలు లొంగరు అని, ప్రజలు తన వెంటే ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు.ఇంకా అనేక ప్రశ్నలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై స్పందిస్తూ కేసీఆర్ సమాధానం చెప్పాలి అంటూ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.