కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఎన్నో నాగరికతలు, జీవన విధానాలు ఉన్నాయని అప్పుడప్పుడు పరిశోధకులు రుజువు చేస్తున్నారు.అలాగే అప్పటి కాలంలో నాగరికత ఆనవాళ్ళుని తెలియజేసే విధంగా కొన్ని వాస్తవాలని బయటకి తీసుకొస్తున్నారు.
ఈ భూమి మీద మనకంటే ముందుగానే కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉందని, కాల, మాన పరిస్థితులు, భౌగోళిక మార్పుల కారణంగా మానవ మనుగడలో మార్పు వచ్చిందని చెబుతూ ఉంటారు.ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ పరిశోధకుల బృందం భారత్ లో రాతియుగం నాటి ఆనవాళ్ళుని గుర్తించారు.
ప్రస్తుతం ఎడారిగా ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు జీవనది ప్రవహించేది అని రుజువు చేశారు.రాజస్థాన్ బికనీర్ సమీపంలో థాయ్ ఎడారిలో పరిశోధనలు చేసి 1.72 లక్షల ఏళ్ల క్రితం ప్రవహించిందని తెలుసుకున్నారు.
ప్రఖ్యాత థార్ ఎడారి మధ్య భాగంలో ప్రవహించిన ఈ నది నాటి రాతియుగం ప్రజలకు జీవనాడిగా విలసిల్లిందని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు.
మానవ వలసలకు ఇది ముఖ్యమైన ప్రాంతంగా నిలిచిందని పరిశోధకులు పేర్కొన్నారు.ఈ పరిశోధనలో పాలుపంచుకున్న జేమ్స్ బ్లింక్ హార్న్ మాట్లాడుతూ నదిలోని ఇసుక రేణువుల్లో ఉండే క్వార్ట్జ్ రేణువులు చివరిసారిగా ఎప్పుడు కాంతికి గురయ్యాయన్న విషయాన్ని ల్యూమినిసెన్స్ డేటింగ్ విధానం ద్వారా గుర్తించి ఈ నది వయసును అంచనా వేశామని చెప్పారు.
ఇదే థార్ ఎడారిలోని లునీ లోయలో ఓ నది 80 వేల ఏళ్ల కిందట సజీవంగా ఉండేదని, మాహి, సబర్మతి, ఒర్సాంగ్ ప్రాంతాల్లో లక్ష ఏళ్ల కింద నీరు ప్రహించిన ఆనవాళ్లు కూడా లభ్యమయ్యాయని బ్లింక్ హార్న్ వెల్లడించారు.