దేశంలో అతిపెద్ద క్రికెట్ పండగ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని త్వరలో నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది.ఇప్పటికే కేంద్రం నుంచి కూడా ఐపీఎల్ నిర్వహణకి గ్రీన్ సిగ్నల్ దొరికింది.
దుబాయ్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించడానికి ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు.తక్కువ మంది ఆడియన్స్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అలాగే ఐపీఎల్ లో పాల్గొనే ఆటగాళ్ళు, టీం మేనేజ్ మెంట్ సభ్యులకి అన్నిరకాలుగా కరోనా పరీక్షలు నిర్వహించి సీజన్ లో పాల్గొనడానికి పర్మిషన్ ఇవ్వాలని భావిస్తున్నారు.ఇక ముందుగా ప్రతి టీం ఫ్రాంచైజ్ ఎవరికీ వారు ఐపీఎల్ సీజన్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది.
ఈ నేపధ్యంలో ఐపీఎల్ బయో సెక్యూర్ బబుల్లోకి అడుగుపెట్టడానికి ముందు ఐదుసార్లు కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షలో నెగెటివ్గా రావాలి.ముందుజాగ్రత్తతో ప్రాంఛైజీలు 6-7 సార్లు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి.
ఆగస్టు 20-24న యుఏఈకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ప్రాంఛైజీలు అప్పుడే సభ్యులు అందరికి పరీక్షలు నిర్వహణలో మొదటి దశని మొదలు పెట్టాయి.ఈ ప్రక్రియలో రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్ పాజిటివ్గా తేలినట్టు ప్రాంఛైజీ బుధవారం వెల్లడించింది.
కరోనా పాజిటివ్ విషయాన్ని దిశాంత్కు తెలియజేసిన ప్రాంఛైజీ, తక్షణమే ఆసుపత్రిలో చేరటంతో పాటు 14 రోజుల క్వారంటైన్లో ఉండాలని సూచించింది.దిశాంత్తో రాయల్స్ క్రికెటర్లలో ఎవరూ కలువలేదు.
దీంతో రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ ఊపిరి పీల్చుకుంది.దిశాంత్ కి కరోనా రావడంతో ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఫ్రాంచైజీ సభ్యులలో నమోదైన మొదటి కేసు అతనిదే అయ్యింది.