కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆలస్యంగా ప్రారంభమైన అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం ఆయోధ్య రామ మందిరం నిర్మాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
రామ మందిర నిర్మాణంలో పింక్ స్టోన్ ను వినియోగించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.రాజస్థాన్ సర్కార్ పింక్ స్టోన్ విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేకమైన కారణాలే ఉన్నాయి.
రామ మందిర నిర్మాణంలో పింక్ స్టోన్ ను వినియోగిస్తున్న నేపథ్యంలో కొందరు మందిర నిర్మాణాన్ని అడ్డు పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా పింక్ స్టోన్ తవ్వకాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.
అధికారికంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఎవరికీ పింక్ స్టోన్ తవ్వకాల కోసం అనుమతులు ఇవ్వకపోయినా తవ్వకాలు మాత్రం జరుగుతున్నాయి.
కొందరు అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
రామ మందిరం పేరు చెప్పుకొని కొందరు అక్రమార్కులు పింక్ స్టోన్ అక్రమ తవ్వకాలకు తెర లేపారని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచనలు చేశారు.దీంతో అక్రమ తవ్వకాలను ఆపేందుకు రాజస్థాన్ సర్కార్ రామ మందిర నిర్మాణంలో పింక్ స్టోన్ ను నిషేధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.
జారీ చేసిన ఉత్తర్వుల వల్ల ఇకపై ఎవరికీ పింక్ స్టోన్ తవ్వకాలు జరపడానికి అనుమతులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.అధికారులు చెక్ పోస్టులలో దాదాపు 20 టన్నుల అక్రమంగా తరలిస్తున్న పింక్ స్టోన్ ను పట్టుకోవడంతో రాజస్తాన్ సర్కార్ ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది.
రాజస్తాన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై అక్కడి ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అక్రమార్కులకు అడ్డుకట్ట వేయడం కోసం పింక్ స్టోన్ పై నిషేధం విధించడం గురించి కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.