ఒకపక్క కోవిడ్-19 తో యుద్ధం చేస్తున్న భారత్ పై చైనా మరోసారి హద్దులు మీరి ప్రవర్తిస్తుంది.గత నాలుగు నెలలుగా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
గాల్వన్ లోయ ఘర్షణ మొదలుకొని పాంగాంగ్ లేక్ ఫైట్ వరకు కూడా రోజు రోజుకు చైనా హద్దులు మీరి ప్రవర్తిస్తుంది.రెచ్చగొట్టే చర్యలతో సరిహద్దుల్లో చైనా ప్రవర్తిస్తున్న తీరు మరింత ఇబ్బంది కలిగిస్తుంది.
ఇప్పటికే పలుమార్లు ఇరు దేశాల మిలటరీ అధికారులు చర్చలు జరిపినా ఈ సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదు.దీనితో ఇక ఇప్పుడు ఈ సమస్య పై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది.
షాంఘై సహకార సంస్థ(NCO) సదస్సు కోసం రక్షణ మంత్రి రాజ్ నాథ్ మాస్కోకు వెళ్లిన సంగతి తెలిసిందే.అయితే ఇదే సమావేశంలో పాల్గొనడం కోసం చైనా రక్షణ మంత్రి వీ ఫెంజీ కూడా అక్కడే ఉండడం తో ఈ సదస్సు ముగిసిన తరువాత వీరిద్దరూ సమావేశమై సరిహద్దు వివాదం పై చర్చించనున్నట్లు తెలుస్తుంది.
అయితే రాజ్ నాథ్ తో భేటీ అవ్వడానికి చైనా రక్షణ మంత్రి ముందుగా సుముఖత చూపినట్లు తెలుస్తుంది.సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో చైనా నే చర్చలకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
భారత్-చైనా సరిహద్దు వివాదం కేవలం దౌత్యపరంగా, చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని భావిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే చైనా నుంచి భేటీ ప్రతిపాదన రావడం గమనార్హం.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వీరిద్దరి భేటీ హాట్ టాపిక్గా మారింది.
ఈ భేటీ లో ఎలాంటి అంశాలు చర్చిస్తారు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.సరిహద్దు ఉద్రిక్తతలతో పాటు ఇటీవల చైనా యాప్ లపై విధించిన నిషేధం వంటి అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.