కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ ఇప్పుడిప్పుడే సడలింపులతో చివరిదశకు చేరుకుంటోంది.ఈ క్రమంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం తెలిపింది.
కాగా ఈ లాక్డౌన్ కారణంగా అనేక రంగాలు స్తంభించిపోయాయి.ఈ క్రమంలోనే సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసి సినిమా రంగానికి చెందిన పనులు జరుపుకునేందుకు అనుమతిని కోరారు.
అయితే కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని వారు కేసీఆర్కు తెలిపారు.దీంతో షూటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తమకు తెలిపేలా ఓ వీడియో తీసి చూపించాలని కేసీఆర్ వారిని ఆదేశించారు.
కాగా ప్రస్తుతం షూటింగ్ను జరుపుకునేందుకు ముందుకు వచ్చిన రెండు భారీ బడ్జెట్ చిత్రాలైన ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్ర యూనిట్లు ఈ షూటింగ్లు ఎలా నిర్వహిస్తారనే అంశంపై వీడియో తీసి ప్రభుత్వానికి పంపేందుకు రెడీ అయ్యారు.
ఆర్ఆర్ఆర్కు సంబంధించిన కొన్ని చిన్న సీన్స్ను ప్రస్తుతం పూర్తి చేయాలని రాజమౌళి చూస్తున్నాడు.
అటు ఆచార్య సినిమా కోసం కొరటాల కూడా ఇదే తరహా ప్లాన్ చేస్తున్నాడు.ఇప్పుడు వీరిద్దరు పంపే వీడియోపైనే తెలుగు చిత్రాల షూటింగ్ అనుమతి ఆధారపడి ఉందని, వారు ఈ టెస్టులో ఎలా పాస్ అవుతారా అని ఇండస్ట్రీ వర్గాల్లో ఆతృత నెలకొంది.
ఈ పరీక్షలో పాస్ అయితే మిగతా సినిమాల షూటింగ్లకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపేందుకు రెడీగా ఉంది.