ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ తన వేగాన్ని ఎక్కడా తగ్గించనంటోంది.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటిన్నర మంది ఈ మహమ్మారి బారిన పడగా, దాదాపు ఆరు లక్షల మంది తమ ప్రాణాలను వదిలారు.
దీంతో అన్ని దేశాలు ఈ వైరస్ బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు నివారణ చర్యలు తీసుకుంటున్నారు.అయితే ఈ వైరస్ విజృంభిస్తుండటంతో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
అయితే కరోనా నుండి కోలుకున్న వారి ప్లాస్మాను కరోనా రోగులకు ఎక్కించడంతో వారు తొందరగా కోలుకుంటున్నారని తేలడంతో ఇప్పుడు ప్లాస్మా థెరఫీకి మంచి డిమాండ్ ఏర్పడింది.దీంతో కరోనా నుండు కోలుకున్న వారు తమ ప్లాస్మాను దానం చేయాల్సిందిగా ప్రభుత్వం, వైద్యులు, సెలెబ్రిటీలు కోరుతున్నారు.
ఈ క్రమంలో దర్శకధీరుడు రాజమౌళి కూడా కరోనా నుండి కోలుకున్న వారిని ప్లాస్మా దానం చేయాల్సిందిగా కోరాడు.కరోనా రావడం సిగ్గుపడాల్సిన విషయం కాదని, తమ ప్లాస్మాను దానం చేసి తోటివారి ప్రాణాలను కాపాడాలని ఆయన కోరాడు.
కాగా కరోనా సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించాడు.ఇక కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే సినిమా షూటింగ్లు దాదాపు మూడు నెలలుగా వాయిదా పడుతుండటంతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా షూటింగ్ వాయిదా వేసుకుంది.
ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన వెంటనే ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించాలని జక్కన్న అండ్ టీమ్ భావిస్తోంది.