మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.21వ తేదీన తెలంగాణకు రాబోతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బిజెపి కండువా కప్పుకోబోతున్నారు.కేవలం కాంగ్రెస్ కు రాజీనామా చేయడమే కాకుండా, ఆ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గతంలోనే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రోజునే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించినా, ఆ రోజు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో రాజీనామా ఆలస్యమైంది.
ఇక అప్పటి నుంచి స్పీకర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.అయితే ఈ రోజు స్పీకర్ అందుబాటులోకి వస్తారని, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే కలుస్తానని, అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా అందించి ఆమోదించుకుంటానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
ఒకవేళ స్పీకర్ అపాయింట్మెంట్ ఆలస్యమైనా, అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖను అందిస్తానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.అంతేకాకుండా స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ కు కేంద్ర ఎన్నికల సంఘానికి మెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపనున్నట్లు ఆయన ప్రకటించారు.
దీంతో ఈ రోజు స్పీకర్ అపాయింట్మెంట్ దొరికినా, దొరకపోయినా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయమైంది.ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ తదితర పార్టీలు ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి.ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేస్తుండగా, మరికొన్ని పార్టీలు సర్వే సంస్థలను రంగంలోకి దించి వాస్తవ పరిస్థితులను అంచనా వేసే పనులు ఉన్నాయి.ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయం కావడంతో, తెలంగాణలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది.