గోల్డ్ స్కీం పేరిట బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాలు తనను మోసం చేశారంటూ ఓ ఎన్ఆర్ఐ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం హిందీ చిత్రసీమలో కలకలం రేపింది.కొద్దిరోజులుగా మౌనం వహించిన రాజ్కుంద్రా ఎట్టకేలకే ఈ వ్యవహారంపై స్పందించారు.
ఓ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.సచిన్ జోషి ఆరోపణలను ఖండించడంతో పాటు నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రచురించినందుకు మీడియాపై మండిపడ్డారు. ముందుగా శిల్పాకు కానీ, తనకు కానీ ఎన్ఆర్ఐ నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదు.వారి ప్రశ్నలకు సమాధానం కావాలంటే అందుకు సంబంధించిన వివరాలన్నీ వెబ్సైట్లో ఉన్నాయన్నారు.ప్రజలను తప్పుదోవ పట్టించకుండా ఉండేందుకు గాను, సమాచారాన్ని ప్రచురించే ముందు నిజానిజాలు నిర్థారణ చేసుకోవాల్సిందిగా రాజ్ కుంద్రా మీడియాకు విజ్ఞప్తి చేశారు.జోషి తన బకాయిలు చెల్లించలేదని కూడా కుంద్రా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అన్ని వ్యాపారాలకు సరైన కమ్యూనికేషన్ మార్గాలు ఉన్నాయని, ఎందుకంటే ప్రపంచం మొత్తం తమతో వ్యవహారాలు నెరుపుతోందని రాజ్ తెలిపారు.మమ్మల్ని సంప్రదించకుండా ఆ వ్యక్తి మీడియాను ఎందుకు ఆశ్రయించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2014లో ఓ గోల్డ్ స్కీం ప్రకటించింది.దీనిలో భాగంగా రూ.18.58 లక్షలకు కేజీ బంగారాన్ని కొనుగోలు చేయడంతో తనకు ఒక కార్డు ఇచ్చారని.అయితే ఐదేళ్ల తర్వాత ముందుగా చెప్పినట్లు కేజీ బంగారాన్ని ఇవ్వలేదని సచిన్ జోషీ అనే ఎన్ఆర్ఐ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.డబ్బులకు తగిన బంగారాన్ని తీసుకోవడానికి వెళితే అప్పటికే కంపెనీని మూసివేశారని…శిల్పా దంపతులు 2017లోనే డైరెక్టర్లుగా రాజీనామా చేశారని జోషీ ఆవేదన వ్యక్తం చేశారు.
తాను మోసపోయానని గుర్తించి, శిల్పా, రాజ్కుంద్రాలపై కేసు నమోదు చేసినట్లు సచిన్ తెలిపారు.