జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ విషయంలో ఏ క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు.ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలా లేక ఒంటరిగా బలం పెంచుకునే దిశగా అడుగులు వేయాలా అనేది స్పష్టత లేదు.
దీనికి బీజేపీ నేతలు వైఖరి కూడా ఒక కారణంగా కనిపిస్తోంది.గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి కోసం పవన్ త్యాగం చేసినా, ఆ పార్టీ ఎంపీ అరవింద్ జనసేన ను తీసిపారేసినట్టుగా మాట్లాడడం అవమానంగా పవన్ భావిస్తున్నారు.
అదీ కాకుండా అరవింద్ వ్యాఖ్యలను బీజేపీ అగ్రనేతలు ఎవరూ ఖండించకపోవడం వంటి వ్యవహారాలు పవన్ కు మరింత ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.ఇదిలా ఉంటే ఏపీలో రాజకీయ వేడి పెంచేందుకు పవన్ డిసైడ్ అయ్యారు.
ఈ మేరకు నివర్ తుఫాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విషయంలో ఏపీ ప్రభుత్వంపై పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది.
ప్రభుత్వం ఎటువంటి సాయం ప్రకటించకపోవడం తో రైతులలో ఆందోళన పెరుగుతుండడంతో, అన్ని రాజకీయ పార్టీలు రంగంలోకి దిగి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి, రాజకీయంగా తమకు కలిసి వచ్చే విధంగా చేసుకోవాలనే అభిప్రాయంలో పవన్ ఉన్నారు.ఈ మేరకు ఏపీలో బుధవారం నుంచి పర్యటన మొదలు పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.బుధవారం గుంటూరు జిల్లాలో , ఆ తర్వాత మూడు రోజుల పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పవన్ పర్యటిస్తారు.
ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.వారికి పంట నష్ట పరిహారం అందే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు.అయితే పవన్ ఈ కార్యక్రమాలన్నీ సొంతంగానే జనసేన తరఫున చేపట్టేందుకు సిద్దం అవుతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
గతంలో పవన్ ఏ పని చేయాలన్నా, బిజెపి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది.
దీంతో పవన్ రాజకీయంగా కాస్త వెనకబడి పోయారు.అయితే అదే సమయంలో బిజెపి సొంతంగానే వివిధ కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటూ ముందుకు వెళ్తుండడం తో ఇకపై బీజేపీ తో సంబంధం లేకుండా సొంతంగానే ఏపీలో జనసేన తరపున పార్టీ కార్యక్రమాలను రూపొందించుకునే పనికి శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తున్నారు.
ఇక చిత్తూరు జిల్లాలో పర్యటన పెట్టుకోవడం వెనుక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతుండటంతో, తన బలాన్ని నిరూపించుకునేందుకు పవన్ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పర్యటించి బల నిరూపణకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తున్నారు.