వేసవి తాపంతో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే.మరో వైపు ఊహించని విధంగా అకాల వర్షంతో నగరవాసులు సేదతీరుతూ ఉంటే రైతులు మాత్రం ఈ అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయారనే చెప్పాలి.
గత రెండు రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షం కురుస్తుంది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది.
హైదరాబాద్తోపాటు సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇవాళ కూడా వర్షం కురిసింది.అయితే ఈ సారి వర్షం మామూలుగా పడకుండా భారీ వడగళ్ళ వాన కురవడంతో రైతుల పంటలకి విపరీతం నష్టం వాటిల్లింది అని చెప్పాలి.
ముఖ్యంగా మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్ల వాన, కరీంనగర్ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం పడింది.జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వరుసగా మూడోరోజు కూడా గాలివాన, వడగళ్లు పడడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇప్పటికే గురువారం రాత్రి గంట పాటు కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది.పంట నష్టం భారీగా ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ వర్షాలు మరో రెండు, మూడు రోజులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.