2014కు ముందు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలమైన పార్టీగా ఉండేది.రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో బలం పుంజుకోవడం ఖాయం అని, ఏపీలో కాస్త తగ్గినా, ఆ వెంటనే మళ్లీ నిలదొక్కుకుంటాం అని పార్టీ అధినాయకత్వం భావించి రాష్ట్రంను రెండుగా విడదీసిన విషయం తెల్సిందే.
తెలంగాణలో అధికారం దక్కించుకుంటాం అని భావించిన కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం మిగిలింది.ఇక ఏపీలో నామరూపాలు లేకుండా పోయింది.
కనీసం ఏపీలో పోటీకి అభ్యర్థులు కూడా కరువయ్యారు.అన్యాయంగా ఏపీని విడదీసి ఆంధ్రాకు అన్యాయం చేశారు అంటూ అంతా ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటీ అనేది 2014 ఎన్నికలతో తేలిపోయింది.2019లో అయినా కాస్త బలం పుంజుకుంటుందేమో అని అంతా భావించారు.కాని అనూహ్యంగా ఇప్పటి వరకు పార్టీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారు అయ్యింది.అయితే మరో పది నెలల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
గతంలో పార్టీని వదిలేసి వెళ్లిన సీనియర్ నాయకులను మరియు మాజీ మంత్రులను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్దం అయ్యింది.
ఏపీ కాంగ్రెస్ కీక నేత, మాజీ కేంద్ర మంత్రి అయిన పల్లంరాజుకు ఆ బాధ్యత అప్పగించారు.
పార్టీ నుండి వెళ్లి పోయిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలంటూ పల్లం రాజును స్వయంగా రాహుల్ గాంధీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.రాహుల్ ఆదేశాల అనుసారం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పల్లంరాజు కలిసి పార్టీలోకి ఆహ్వానించాడు.
పార్టీలో జాయిన్ అయ్యేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇంకా పలువురు మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలతో పల్లంరాజు చర్చలు ప్రారంభించాడు.
కాంగ్రెస్ పార్టీ నుండి గతంలో బయటకు వెళ్లి పోయి మళ్లీ వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ నుండి ఒకసారి వెళ్లి పోతే మళ్లీ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్లను, మాజీలను ఎప్పుడు కూడా వదులుకోదు.గతంలో పలు సందర్బాల్లో ఇది నిరూపితం అయ్యింది.
ఇప్పుడు కూడా అదే విధంగా మాజీలను రంగంలోకి దించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నాడు.ప్రస్తుతం వేరు వేరు పార్టీల్లో ఉండి, ఇమడలేక పోతున్న పలువురు కాంగ్రెస్ మాజీ నాయకులు మళ్లీ పార్టీలో చేరితే ఖచ్చితంగా పూర్వ వైభవం సాధ్యమే అంటున్నారు.2019 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీలో కాంగ్రెస్ చక్రం తిప్పడం ఖాయం అంటూ రాజకీయ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.