దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో ఎన్నో సంచలన సంఘటనలు చోటు చేసుకున్నా, పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతున్న, ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పెద్దగా స్పందించే వారు కాదు.కానీ ఇప్పుడు స్టైల్ మార్చారు.
ఎప్పుడు లేని విధంగా రాహుల్ గాంధీ సొంత పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నా, ఎంతోమంది పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్ళినా, మరెంతోమంది రాజకీయాలు నడుపుతున్న రాహుల్ సైలెంట్ గానే ఉంటూ వచ్చారు.
అయితే ప్రస్తుతం బిజెపి దేశ వ్యాప్తంగా వ్యతిరేకతను ఎదుర్కోవడంతో పాటు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం, అలాగే దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తరపున పని చేసేందుకు సిద్ధమవడం, తదితర కారణాలతో రాహుల్ లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.
ఇక పూర్తిగా ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్ లో నడవాలని డిసైడ్ అయిపోయిన రాహుల్ సరికొత్త రీతిలో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం తో సమావేశమైన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. భయపడే వారు ఎవరు తమ పార్టీకి అవసరం లేదని, వారంతా ఆర్ఎస్ఎస్ లో చేరాలంటూ ఘాటుగా మాట్లాడారు.
కాంగ్రెస్ లో పిరికి వారికి స్థానం లేదని, నిర్భయంగా మాట్లాడే ఎంతో మంది ప్రజలు పార్టీ బయట ఉన్నారని, వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించాలని రాహుల్ ఈ సందర్భంగా సూచించారు.
పార్టీలో కొందరు సభ్యులు ఉన్నారు.వారిని బయటకు పంపండి.పిరికి వారంతా పార్టీని వీడి వెళ్ళండి.
ఆర్ఎస్ఎస్ వైపు పరుగు తీయండి.మీలాంటివారు మాకొద్దు అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే రాహుల్ ఈ వ్యాఖ్యలు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లోనే చేసినట్లు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా బీజేపీకి అధికారం దక్కకుండా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు పన్నుతుండడం రాహుల్ , కాంగ్రెస్ కి బాగా కలసి వచ్చినట్టుగా కనిపిస్తోంది.