తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ పిలుపు వచ్చింది.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతుండడంతో పాటు, అనేక కీలక అంశాల గురించి చర్చించబోతున్నారు.
దీంతో కాంగ్రెస్ సీనియర్లు హస్తిన బాట పట్టారు.ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే గత కొద్ది రోజులుగా మకాం వేశారు.
కీలక నేతలను కలుస్తూ, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో నిమగ్నమయ్యారు.అలాగే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సైతం తన పాదయాత్ర ప్రారంభానికి ముందే ఢిల్లీ పెద్దలను కలిసి, కీలక అంశాలపై చర్చించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ కాబోతున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే 10 మంది నాయకులకు ఏఐసీసీ ఆహ్వానం అందించింది.ఈ పది మందిలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు, సీఎల్పీ నేతలు ఐదుగురు, వర్కింగ్ ప్రెసిడెంట్ లు ,కమిటీ చైర్మన్ లతో రాహుల్ కీలక అంశాలపై సమావేశం నిర్వహిస్తున్నారు.
కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ అవుతుండడంతో ఆయన ఏ అంశాలపై చర్చిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం లేదు.
సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి కొనసాగుతుండడం, సొంత పార్టీలోనే విపక్షం అన్నట్లుగా వ్యవహారం చోటుచేసుకోవడం, వంటి పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం చాలా కాలం నుంచే తీవ్ర అసంతృప్తితో ఉంది.ఈ పరిణామాలపై ఎప్పటికప్పుడు కాంగ్రెస్ అధిష్టానం నివేదికలు తెప్పించుకుంటున్నా, ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకునేందుకు గాని, వార్నింగ్ లు ఇచ్చేందుకే కానీ ముందుకు రాలేదు.అయితే ఇప్పుడు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు.వారితో ఆయన ఏ అంశాలపై చర్చిస్తారు ? ఎవరెవరికి వార్నింగ్ ఇస్తారు ? ఏ ఏ కీలక సూచనలు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.