వెనకటికి ఒకడిని ‘బొంకరా బొంకరా అంటే మా ఊరి మిరియాలు తాటికాయలంత’ అన్నాడట.అంటే అబద్ధాలు చెప్పడంలో కూడా శృతి మించిన అతిశయోక్తి ఉందని అర్థం.
కేంద్ర మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ కూడా ఇదే టైపు మనిషిలా ఉన్నాడు.రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు అది అర్ధవంతంగా, అవతలివారి తప్పులను ఎండగట్టే విధంగా ఉండాలి.
మరీ అవతలివారు ఎందుకూ పనికిరానివారని, పిచోళ్లని ప్రచారం చేయకూడదు.అది రాజకీయం కాదు.
కేంద్ర మంత్రి నఖ్వీ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శిస్తూ ‘రాహుల్కు ఉల్లిగడ్డకు, పిజ్జాకు తేడా తెలియదు.వంకాయకు, బర్గర్కు వ్యత్యాసం కనుక్కోలేడు.
అలాంటి వ్యక్తి రైతు నాయకుడిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు’ అని విమర్శించారు.తేడా కనుక్కోలేకపోవడానికి రాహుల్ బుద్ధిమాంద్యుడా? ఆయన విధానాలను విమర్శించాలిగాని కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఇలా పిచ్చిగా మాట్లాడటం బాగాలేదు.రాజకీయాల్లో వ్యక్తులు కాదు, విధానాలే ముఖ్యమని తెలుసుకోవాలి.రాహుల్ విదేశాల నుంచి తిరిగొచ్చిన తరువాత రైతు సమస్యలను నెత్తికెత్తుకున్నప్పటినుంచి భాజపా నాయకులు తెగ కంగారు పడిపోతున్నారు.రాహుల్ను పిచ్చిగా విమర్శించడం కంటే రైతులకు ఫలానా ప్రయోజనాలు కలిగించామని, వారి సంక్షేమానికి ఫలానా పనులు చేశామని చెప్పుకోవచ్చు కదా.అంటే ఈ ఏడాది కాలంలో అలాంటి పనులేమీ చేయలేదని అర్థమవుతోంది.