చిన్న మోపెడ్ బండి పై, పంచే కట్టు, తలపాగాతో ఒక సాధారణ రైతుగా బతుకుతూ, వార్తల్లోకి ఎక్కిన మాజీ మంత్రి, మాజీ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తున్నారు.అయితే ఆయన ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేది ఆయన ప్రకటించకపోయినా, ఆయన వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.2014 లో అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి రఘువీరా పోటీ చేసి ఓటమి చెందారు అలాగే 2019లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి పరాభవానికి గురి అయ్యారు.ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారవడంతో రఘువీరాకు ఓటమి తప్పలేదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా రఘువీర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత అనేక మంత్రి పదవులను ఆయన పొందినా, ఏపీ తెలంగాణ విభజన తర్వాత కాంగ్రెస్ ప్రభావం ఏపీలో పూర్తిగా పడిపోవడంతో పాటు , వరుసగా ఓటమి ఎదురవడంతో రఘు వీరా సైలెంట్ అయిపోయి పూర్తిగా వ్యవసాయ పనులపైనే దృష్టిపెట్టారు.
ఈ క్రమంలో ఆయన సొంత గ్రామమైన మడకశిరలో పూర్తి ఆధ్యాత్మిక చింతనతో గడుపుతున్నారు.అలాగే రెండు పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేశారు.
దీంతో ఆయనకు బీజేపీలో చేరబోతున్నారంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది .కానీ రఘువీరా మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు.
కానీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు వెంకటరామిరెడ్డి, తిప్పేస్వామి లతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న రఘువీరాను పార్టీలో చేరాలని వారు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే వైసిపి మంత్రి బొత్స కూడా వైసీపీ లోకి రావాల్సిందిగా ఆహ్వానాలు పంపుతుండడం తదితర కారణాలతో వైసీపీలో చేరేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.రఘువీరా వైసీపీ లో చేరితే ఆయనకు మంచి ప్రాధాన్యం ఉన్న పదవితో పాటు, ఆయన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని సమాచారం తో వైసీపీ వైపు రఘువీరా చూస్తున్నట్లు తెలుస్తోంది.