రెబల్ అంటే ఎంత గుబులు పుట్టిస్తారో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.నిత్యం ఏదో ఒక అంశంపై వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ఆ పార్టీ అధినేత జగన్ కు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నారు.
పోనీ ఆయన వేరే పార్టీలో చేరే ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అంటే ప్రస్తుతం బిజెపిలోకి వెళ్లే ఛాన్స్ కూడా ఆయనకు కనిపించడం లేదు.అయినా ఆయన మాత్రం తన విమర్శలను కొనసాగిస్తూనే వస్తున్నారు.
రచ్చబండ పేరుతో నిత్యం ఏదో ఒక అంశంపై ఆయన గళం వినిపిస్తూనే వస్తున్నారు.తాజాగా జగన్ పైన వ్యంగ్యాస్త్రాలు రాజు గారు సంధించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే 100 రెట్లు ఎక్కువ జగన్ పని చేస్తున్నట్లుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడాన్ని రాజుగారు తప్పు పట్టడమే కాకుండా విమర్శలు సైతం చేశారు.సజ్జల వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని, ఆయన ఆ విధంగా చెప్పడాన్ని తాను ఖండిస్తున్నానని రాజుగారు రచ్చబండలో వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా అనేక వ్యంగ్యాస్త్రాలను సంధించారు.” వైఎస్సార్ తో సరి సమానంగా జగన్ పని చేస్తున్నారంటే, కొంత నమ్మేవాడిని.అయినా మా నాయకుడికి పబ్లిసిటీ అంటే పెద్దగా ఇష్టం ఉండదు.ఆయన సింప్లిసిటీ కోరుకునే వ్యక్తి.అయితే సజ్జల జగన్ ను ఆ భగవంతుడు గా మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ? అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైఎస్సార్ వంటివారే రెండోసారి అధికారంలోకి వచ్చారు అని రాజు గారు అన్నారు.
అలాగే జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు అవుతున్న సందర్భంగా శుక్రవారం నుంచి పది రోజుల పాటు పండుగలా ఉత్సవాలు జరపాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడంపై రఘురామకృష్ణరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ వంటి నేతలు ఈ తరంలో ఉండడం గొప్ప విషయం.ఆ తరమే కాదు, ఈ తరంలో కూడా అంత గొప్ప నేత ఉండరు అంటూ రాజుగారు వ్యంగ్యంగా విమర్శించారు.
ఈ రోజును స్టేట్ హాలిడే గా ప్రకటిస్తే పండుగ లా జరుపుకుంటాము అంటూ వెటకారపు కామెంట్లు చేశారు.ఇకపై తన రచ్చబండ కార్యక్రమం ప్రతిరోజు ఉండదని, కేవలం ప్రతి మంగళవారం, శుక్రవారం మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించారు.
అసలు తన రచ్చబండ కార్యక్రమానికి వైఎస్సార్ స్ఫూర్తి అంటూ రాజశేఖర్ రెడ్డి ని పొగుడుతూనే జగన్ పై విమర్శలు చేశారు.నిత్యం రఘురామకృష్ణంరాజు ఇదేవిధంగా విమర్శలు చేస్తూ, వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తీసుకొస్తూ, ప్రతిపక్షాలకు మేలు చేసే విధంగా వ్యవహరిస్తుండడం, ఆ పార్టీ నేతలకు ఆగ్రహం కలిగిస్తున్నా, ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.
చాలా కాలంగా ఆయన ఏపీలో అడుగు పెట్టడం లేదు.కానీ నిత్యంం వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా మాత్రం ఉండటం లేదు.