ఏపీలో అధికార పార్టీ ఎంత వేగంగా అయితే పరిపాలనలో ముందుకు వెళుతూ, ప్రశంసలు అందుకుంటుందో, అంతే వేగంగా విమర్శలు ఎదుర్కొంటోంది. సీఎం జగన్ పూర్తిగా తన దృష్టి మొత్తం ప్రజా పరిపాలన పై పెట్టడంతో పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోనట్టు గా కనిపిస్తూ వచ్చారు.
దీంతో పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులకు అసంతృప్తి చెలరేగింది.జగన్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండటం, ఎవరిని కలిసేందుకు ఇష్టపడకపోవడం, ఇవన్నీ పార్టీలో అసంతృప్తిని రాజేసింది.
దీంతో కొంతమంది నాయకులు జగన్ తీరు ను బహిరంగంగానే తప్పు పట్టడం జరిగింది.ముఖ్యంగా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ వ్యవహారాన్ని మరింత హైలెట్ చేశారు.
దీంతో ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వగా, ఆ షోకాజ్ నోటీసు చెల్లదని , అసలు తాను గెలిచిన పార్టీ పేరుతో నోటీసు ఇవ్వలేదని, యువజన శ్రామిక రైతు పార్టీ తమది కాగా వైయస్సార్ పేరుతో నోటీసు జారీ చేశారని, ఈ వ్యవహారాన్ని పరిష్కారం చేయాల్సిందిగా, కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఆయన ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉండగా, ఆయన పై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన హైకోర్టును ఆశ్రయించడం, పార్టీ పేరు కు సంబంధించిన ఈ వ్యవహారంపై ఆయన పిటిషన్ వేయడం జరిగాయి.
దీంతో పాటు వైసిపి పార్టీ పై అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఇప్పటికే ఫిర్యాదు చేశారు .ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి అధికార పత్రాలపై యువజన శ్రామిక రైతు పార్టీని పూర్తి పేరు రాయడం లేదని, వైయస్సార్ అనే పేరుతో తన పార్టీని పోలి ఉండే విధంగా రాయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.మొత్తం ఈ వ్యవహారాలన్నీటి పైన, కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తే జగన్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.మరి ఈ వ్యవహారాలను జగన్ ఏవిధంగా పరిష్కరించుకుంటారు అనేది చూడాలి.