నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అధికార పార్టీ వైసీపీలో ఉంటూనే ఆ పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తుంటారు.వైసీపీ ఎంపీగా కాకుండా వైసీపీ రెబల్ ఎంపీగానే ఆయనకు చాలా క్రేజ్.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలకు సంబంధించిన విషయాలపై నిత్యం రఘురామకృష్ణంరాజు మీడియా ముందు ఆరోపిస్తుంటారు.ఇప్పటికీ ఆయనకు, ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.
తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సిద్ధమవుతున్నారు.సోమవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో ప్రధాని మోదీ 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీగా రఘురామకృష్ణంరాజు కూడా ప్రధాని పర్యటనలో పాల్గొనబోతున్నారు.అయితే ఇక్కడే ఆయన చిక్కుల్లో పడ్డారు.
రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా వివిధ దళిత సంఘాల కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.భీమవరం పట్టణంలోకి అడుగు పెట్టకముందే దళితులకు ఎంపీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
దళిత ఉద్యోగులను కించపరిచేలా ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారని.అంతేకాకుండా దళిత క్రైస్తవులపై కూడా ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో రఘురామను ఎస్సీ ఎస్టీ చట్టం కింద అరెస్టు చేయాలని ఏపీ బహుజన ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది.దీంతో రఘురామ దళిత సంఘాలకు క్షమాపణ చెప్తారో లేదో అన్న అంశం హాట్ టాపిక్గా మారింది.
కాగా మరోవైపు ఎంపీ రఘురామ భీమవరం పర్యటనకు అధికారులు ఆటంకాలు సృష్టించారు.ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనేందుకు రఘురామకు అధికారుల వెహికల్ పాస్ మంజూరు చేయలేదు.
ఈ విషయాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు.
ఈ అంశంపై డీఆర్వోకు బాధ్యతలు అప్పగించామని కలెక్టర్ వెల్లడించగా.వెహికల్ పాస్ మంజూరు కోసం ఫైల్ పంపించామని చెప్పి డీఆర్వో జారుకున్నారు.అయితే రఘురామరాజు ఫోన్ను జిల్లా ఎస్పీ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.
అటు ఎంపీ రఘురామ పర్యటన సమయంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యల తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.అయితే రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటనను విరమించుకున్నారు.
భీమవరం వచ్చేందుకు బయలుదేరిన ఎంపీ రఘురామకృష్ణరాజు మధ్యలోనే ట్రైన్ దిగిపోయారు. హైదరాబాద్ లింగంపల్లిలో రైలు ఎక్కిన ఎంపీ రఘురామకృష్ణరాజు బేగంపేట రైల్వేస్టేషన్ లో దిగిపోయారు.
దీంతో ఆయన భీమవరంలో మోదీ సభకు హాజరయ్యే అవకాశాలు కనిపించడంలేదు.