వైసీపీ రాజు గారి వ్యవహారంలో ముగింపు ఎప్పు డో ఇంకా క్లారిటీ లేకుండా పోయింది.ఆయన వైసీపీ అధిష్టానంపై విమర్శలు చేయడం, ఆయనపై పార్టీ నాయకులు విమర్శలు చేయడం ఒకరికొకరు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేసుకోవడం, ఇలా కొద్దిరోజులుగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తూ వస్తోంది.
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన కనుమూరి రఘురామకృష్ణంరాజు గెలిచిన కొంతకాలం వరకు పార్టీకి విధేయుడిగా ఉంటూ వచ్చినా, తరువాత క్రమంగా కేంద్ర బీజేపీ పెద్దలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం, వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం వంటి వ్యవహారాలు ఎన్నో చేశారు.కానీ ఎక్కడా ఏ విషయంలోనూ పార్టీకి సమాచారం ఇవ్వకుండా ఆయన స్వతంత్రంగా వ్యవహరించడం పై అప్పట్లోనే ఆయనకు అధిష్టానం నుంచి హెచ్చరికలు వెళ్లాయి.
ఇక ఆ తరువాత కొంతకాలం సైలెంట్ గానే ఉన్నారు.ఆ తరువాత సొంతపార్టీ పైన విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కారు.
ఆ వ్యాఖ్యలు మరీ శృతిమించడంతో ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ రంగంలోకి దిగింది.
ఈ వ్యవహారంలో రఘురామకృష్ణరాజు కాస్త వెనక్కి తగ్గినట్టు తగ్గుతూ మళ్ళీ విమర్శలు చేస్తూ వస్తున్నారు.తాను ఒక పక్క జగన్ కు వీర విధేయుడునే అని చెబుతూనే విమర్శలు చేస్తుండడంతో, ఆయన వ్యవహారంపై పార్టీ సీరియస్ గానే దృష్టి పెట్టింది.నరసాపురం పార్లమెంట్ నియోజక పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయన వ్యవహారం పై గుర్రుగా ఉండడమే కాకుండా, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం వెళ్ళింది.
తనకు జగన్ అంటే పిచ్చి ప్రేమ అంటూ చెబుతూ, తాను పార్టీని వీడి వెళ్ళేది లేదని చెబుతూనే, మీడియా డిబేట్ లో పాల్గొంటూ జగన్ గొప్పేముంది ? నా బొమ్మ వేసుకునే ఎన్నికలకు వెళ్లాను, నాకు వాల్యూ ఉంది అంటూ మాట్లాడుతూ, పార్టీ అధిష్టానానికి మరింత ఆగ్రహం తెప్పిస్తుంది.పార్టీ ఆయనకు షోకాజ్ నోటీస్ ఇస్తే , తిరిగి ఆయన పార్టీకి నోటీసులు ఇచ్చినంతగా హడావుడి చేస్తూ వస్తున్నారు.
ఇప్పటికే రఘురామకృష్ణంరాజు పై వైసీపీ మంత్రి రంగనాథ రాజు , భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వంటి వారు ఫిర్యాదు చేశారు.అయినా తాను పార్టీలోనే ఉంటాను అన్నట్లు వ్యవహరిస్తూ ఢిల్లీ స్థాయిలో వైసీపీ పై ఫిర్యాదు చేస్తూ చేస్తున్నారు.ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు.రఘురామకృష్ణంరాజు పార్టీకి విధేయుడు అయితే ఎందుకు విమర్శలు చేస్తున్నాడు.పోనీ బీజేపీలోకి వెళ్లేందుకు ఇదంతా చేస్తున్నాడా అంటే తాను వైసీపీలోనే ఉంటానంటూ చెబుతూనే, సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు.ఈ వ్యవహారం ఎటు తేలేలా కనిపించకపోవడంతో, వైసిపి ఆయనపై అనర్హత వేటు వేయించి ఆయనకు చెక్ పెట్టడంతోపాటు, నరసాపురం ఉప ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.