ఏపీ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్న ట్లుగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా రాజుకున్న చిచ్చు రోజురోజుకు ఎగిసిపడుతోంది.
పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంలో రఘురామకృష్ణంరాజు వైసీపీకి వ్యతిరేకంగా, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ వ్యవహారం తరువాత రఘురామకృష్ణరాజు కాస్త మెత్తబడినట్టు గా కనిపించారు.తాను జరుగుతున్న వాస్తవాలను మాత్రమే చెబుతున్నానని, కానీ ఎప్పటికీ పార్టీకి విధేయుడినే అని చెబుతూ కాస్త వెనక్కి తగ్గినట్లుగా కల్పించారు.
కాకపోతే ఈ వ్యవహారంలో వైసీపీ అధినేత సీఎం జగన్ సీరియస్ గానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీలు అంతా కలిసి ఈ రోజు ఢిల్లీకి వెళ్లి లోక్ సభ స్పీకర్ ను కలవబోతున్న నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు.
తనపై అనర్హత వేటు వేయాలని, సస్పెన్షన్ చేయించాలని తీసుకుంటున్న చర్యలను వెంటనే నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.అసలు తాను ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ తో షోకాజ్ నోటీసులు వచ్చాయని, యువజన రైతు శ్రామిక పార్టీ తరపున ఎన్నికైన తనకు ఆ పేరుమీద షోకాజ్ నోటీస్ ఇవ్వలేదని ఆయన చెప్పారు.
ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అత్యవసర కేసులను మాత్రమే హైకోర్టు విచారిస్తోంది.ఈ నేపథ్యంలో సోమవారం రఘురామకృష్ణరాజు పిటిషన్ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీల బృందం ఈ రోజు ఢిల్లీకి వెళ్లి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు.ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అపాయింట్మెంట్ కూడా ఖరారైంది.