ఖతర్ లో పనిచేసే వలస వాసులకు స్థానిక ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది.ఖతర్ లో పనిచేసే ప్రవాస కార్మికులకు కనీస వేతనాలు అందేలా వేతన చట్టం తీసుకువచ్చింది.
దాంతో ఎంతో మంది వలస వాసులకు ఈ చట్టం ఊరట నివ్వనుంది.ఈ రోజు అంటే 20 వ తేదీ నుంచీ ఈ చట్టాన్ని అమలు చేయనుంది ఖతార్ సర్కార్.
ఇంతకీ ఏమిటా చట్టం, భారతీయులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే వివరాలు పరిశీలిద్దాం.
లా నెంబర్ 17 ఆఫ్ 2020 పేరుతో తీసుకువచ్చిన ఈ చట్టం ప్రకారం ఖతర్ లో పనిచేసే ప్రతీ కార్మికుడికి కనీస వేతనంగా 1000 రియాళ్ళు అంటే మన భారత కరెన్సీలో రూ.20 వేలు తప్పనిసరిగా ఇవ్వాలి.అంతేకాదు అందుకు గల నిభందనలు కూడా జారీ చేయనుంది.
వలస కార్మికులు పనిచేసే ఆయా కంపెనీ లు వారికి ఉచితంగా భోజనం, వసతి కల్పించి వారికి 1000 రియాళ్ళు ఇవ్వాలి.ఒక వేళ కంపెనీ సదుపాయాలు కల్పించక పొతే
కంపెనీ కార్మికుడికి చెల్లించే 1000 రియాళ్ళ కు అదనంగా మరో 800 రియాళ్ళు ఇవ్వాలి.ఇందులో500 రియాళ్ళు వసతి సదుపాయానికి, 300 రియాళ్ళు భోజన సదుపాయానికి కేటాయించారు.ఈరోజు అనగా 20వ తేదీ నుంచీ తప్పకుండా ప్రతీ ప్రభుత్వ, ప్రవైటు సంస్థలు ఈ విధానాన్ని అమలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలాఉంటే ప్రతీ నెల కంపెనీలు కార్మికులకు ప్రస్తుతం చెల్లించే మొత్తం కేవలం 700 రియాళ్ళు , కొన్ని కంపెనీలు అయితే 500 రియాళ్ళు మాత్రమే.ప్రభుత్వ తాజా ప్రకటనతో వలస వాసులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఖతర్ లో అత్యధికంగా వలస కార్మికులుగా ఉంటున్న భారతీయులు ఈ ప్రకటన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.