దగ్గుబాటి, నారా కుటుంబాల మధ్య వైరం అందరికీ తెలిసిందే.రెండు దశాబ్దాలుగా ఈ తోడల్లుళ్లు ఉప్పు, నిప్పులా ఉంటున్నారు.2014లో టీడీపీ, బీజేపీ జట్టు కట్టిన సమయంలోనూ చంద్రబాబు, పురందేశ్వరి ఎడమొహం, పెడమొహం అన్నట్లుగానే వ్యవహరించారు.దగ్గుబాటి కుటుంబం నుంచి ఎప్పుడూ బాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలే విన్నాం.
అయితే తొలిసారి పురందేశ్వరి ఆయన విషయంలో సానుకూలంగా స్పందించడం గమనార్హం.మొన్న అమరావతి పర్యటనలో చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులు విసిరిన ఘటన తెలుసు కదా.దీనిపై ఆమె స్పందించారు.అలా చేయడం తప్పు అని పురందేశ్వని స్పష్టం చేశారు.
నిరసన తెలపడంలో తప్పు లేదు కానీ.ఇలా రాళ్లు, చెప్పులు వేయడమేంటని ఆమె ప్రశ్నించారు.
అంతేకాదు అమరావతిని వైసీపీ మంత్రి శ్మశానంతో పోల్చడంపై కూడా పురందేశ్వరి మండిపడ్డారు.వైసీపీ అధికారంలోకి వచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని, రాష్ట్రంలో ఇసుక కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆమె అన్నారు.రాజధానిపై ఎటూ తేల్చకపోవడం, పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను కూడా పురందేశ్వరి తప్పుబట్టారు.
ఈ మధ్య వైసీపీకి, బీజేపీకి దూరం పెరుగుతోంది.
అలాగే దగ్గుబాటి వెంకటేశ్వర్రావు పట్ల వైసీపీ వ్యవహరించిన తీరుతో ఆ కుటుంబం కూడా ఆ పార్టీకి దూరమవుతోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సానుకూలంగా పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.