చదువుకుని జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని చాలా మంది కల.కానీ కుటుంబ సమస్యలు, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా అర్ధాంతరంగా చదువు ముగించేవారు కోట్లలో వుంటారు.
దురదృష్టవశాత్తూ ఇందులో మహిళల సంఖ్య కూడా ఎక్కువగానే వుంటుంది.అయితే పెళ్లయి, ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత కాలేజీలో చేరి తన కల నెరవేర్చుకుని నలుగురికి స్పూర్తిగా నిలిచారు పంజాబ్కు చెందిన ఓ ప్రవాస భారతీయురాలు.47 ఏళ్ల వయసులో గుర్జిత్ కౌర్ అనే ఎన్ఆర్ఐ తన యవ్వన రోజులు తిరిగి వచ్చాయని నమ్ముతోంది.ఆమె తన కూతుళ్ల వయసున్న అమ్మాయిల సహవాసంలో ఆనందాన్ని పొందుతోంది.
జలంధర్ నగరానికి సమీపంలోని ఖజుర్లా గ్రామానికి చెందిన గుర్జిత్ కౌర్ కాలేజీ జీవితాన్ని పొందలేకపోయింది.దీనికి కారణం లేకపోలేదు.12 తరగతి పూర్తయిన వెంటనే వివాహం చేసుకుని, భర్తతో కలిసి ఫిలిప్పిన్స్కు వెళ్లిపోయింది.
అయితే ఇన్నాళ్లకు జీవితం ఆమెకు మరోసారి అవకాశం కల్పించింది.
ఆమె కుమార్తెలు పంజాబ్లో కొన్నాళ్లు వుండాలని, ఇక్కడి ఆచార వ్యవహారాలు, భాషను అర్ధం చేసుకోవాలని తన భర్త భావించారని గుర్జిత్ తెలిపారు.తన కుమార్తెలు మనీలాలో జన్మించారని, సొంతూరిలో ఉన్నత చదువులు చదివించాలని తన భర్త చెప్పారని గుర్జిత్ పేర్కొన్నారు.
దీంతో తాను డిసెంబర్ 2021లో ఇక్కడికి వచ్చి పిల్లలను స్కూల్, కాలేజీలో చేర్పించానని ఆమె వెల్లడించారు.
తన పెద్ద కుమార్తె కిరణ్ దీప్ (18) సైకాలజీలో బీఏ (ఆనర్స్) చదువుతోందని, చిన్నకూతురు కిరణ్దీప్ (16) ఒక ప్రైవేట్ పాఠశాలలో పదకొండవ తరగతి చదువుతోందని గుర్జిత్ తెలిపారు.తన కుమార్తెలు చదువుల్లో బిజీ అయిపోయినందున, తాను కాలేజీలో చేరాలనే చిరకాల కోరికను తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని భావించానని ఆమె చెప్పారు.దీనిపై తన భర్తతో చర్చించి ఆయన అనుమతితో లియాల్పూర్ ఖల్సా కాలేజ్ ఫర్ ఉమెన్లో ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమాలో అడ్మిషన్ తీసుకున్నానని గుర్జిత్ కౌర్ పేర్కొన్నారు.
తాను ఇక్కడ చేరి రెండు వారాలైందని, ఈ వయసులో మళ్లీ చదువుకోవడం తనకు చాలా సంతృప్తినిస్తోందన్నారు.తొలిరోజు తరగతిలోకి ప్రవేశించగానే.అక్కడి అమ్మాయిలందరూ తనను టీచర్గా భావించి లేచి నిలబడ్డారని గుర్జిత్ చెప్పుకొచ్చారు.అయితే తాను వారి తోటి విద్యార్ధినిని అని ఒప్పించడానికి తనకు కొంత సమయం పట్టిందని ఆమె తెలిపారు.
అంతేకాదు.తన ఉపాధ్యాయులంతా తనకంటే చిన్నవారని గుర్జిత్ చెప్పారు.
కాలేజ్ ప్రిన్సిపాల్ నవజోత్ కౌర్ మాట్లాడుతూ.తాము నైపుణ్యం ఆధారిత కోర్సులను ప్రారంభించినప్పుడు , మధ్య వయస్కులైన మహిళలు చేరాలని తాము ఆశించామని చెప్పారు.
కానీ అది జరగలేదని.ప్రతి ఏడాది చదువుకోవడానికి ఒకరో ఇద్దరు మధ్య వయసు స్త్రీలు వస్తున్నారని నవజోత్ కౌర్ అన్నారు.