వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం లక్షలాది మంది భారతీయులు వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడే కుటుంబంతో సహా స్థిరపడుతున్నారు.
మనదేశంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలను కలిగివున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి.స్వాతంత్య్రానికి పూర్వమే పంజాబీలు కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో స్థిరపడ్డారు.
ఇక గల్ఫ్ దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో పంజాబీ ప్రవాసులు వున్నట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.ఆయా దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సాయపడుతున్నారు.
గ్రామాలను దత్తత తీసుకోవడం, పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, విద్య, ఉపాధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రవాసుల సంక్షేమానికి పంజాబ్ కృషి చేస్తోంది.
తాజాగా రాష్ట్రంలోని ఆప్ సర్కార్ ఎన్ఆర్ఐలకు శుభవార్త చెప్పింది.పంజాబ్లో ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుతమున్న కోర్టుల సంఖ్యను పెంచనుంది.ప్రస్తుతం ఒక్క జలంధర్లో మాత్రమే ఎన్ఆర్ఐ కోర్టు వుంది.తాజా ప్రతిపాదన ప్రకారం.
రాష్ట్రంలో మరో ఐదు ఎన్ఆర్ఐ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.భటిండా, నవాన్షహర్, పటియాలా, హోషియార్పూర్, మోగాలలో వీటిని నెలకొల్పనున్నారు.
పంజాబ్, హర్యానా హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీతో చర్చించిన అనంతరం ఎన్ఆర్ఐ కోర్టులను త్వరగా ప్రారంభించాలని రాష్ట్ర హోం శాఖ.న్యాయ శాఖను కోరింది.
రాష్ట్రంలో ఎన్ఆర్ఐలకు సంబంధించి దాదాపు 2,500 కేసులు పెండింగ్లో వున్నాయని ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ తెలిపారు.ఎన్ఆర్ఐలకు సాధ్యమైన విధంగా సాయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.ఎన్ఆర్ఐ కమీషన్ తోడ్పాటుతో ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోందని ఆయన చెప్పారు.కమీషనర్లు, డీసీసీలు, ఏడీసీలు, ఎస్డీఎంలతో ఎన్ఆర్ఐ సంబంధిత రెవెన్యూ కేసుల డేటాను తమ శాఖ సేకరిస్తోందని కుల్దీప్ సింగ్ చెప్పారు.