వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం లక్షలాది మంది భారతీయులు వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడే కుటుంబంతో సహా స్థిరపడుతున్నారు.
మనదేశంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలను కలిగివున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి.స్వాతంత్య్రానికి పూర్వమే పంజాబీలు కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో స్థిరపడ్డారు.
ఇక గల్ఫ్ దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో పంజాబీ ప్రవాసులు వున్నట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.ఆయా దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సాయపడుతున్నారు.
అయితే ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉండటంతో స్వరాష్ట్రంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో పంజాబ్లోని భగవంత్ మాన్ ప్రభుత్వం ఎన్ఆర్ఐల కోసం కొత్త ఎన్ఆర్ఐ పాలసీని తీసుకురానుంది.
ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ ఓ ప్రకటన చేశారు.
బుధవారం ఎన్ఆర్ఐ శాఖ సీనియర్ అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్త ఎన్ఆర్ఐ ముసాయిదాపై సీనియర్ అధికారులు, పంజాబ్ ఎన్ఆర్ఐ కమీషన్ సభ్యుల నుంచి పలు సూచనలు స్వీకరించారు.అనంతరం ధాలివాల్ మీడియాతో మాట్లాడుతూ.
పంజాబీ ఎన్ఆర్ఐ యువతను వారి మూలాలతో అనుసంధానం చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.అలాగే తమ ప్రభుత్వం వృద్ధుల కోసం ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించనుందని చెప్పారు.
దీని కింద వృద్ధులైన పంజాబీ ఎన్ఆర్ఐలకు రాష్ట్రంలో మతపరమైన , చారిత్రక ప్రదేశాలకు ఉచిత ప్రయాణం అందిస్తారు.
ఇక… సివిల్ లోక్ అదాలత్ల తరహాలో సమస్యల పరిష్కారానికి ఎన్ఆర్ఐ లోక్ అదాలత్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని కుల్దీప్ ధాలివాల్ తెలిపారు.ఈ కోర్టులలో భూమి, వివాహ వివాదాలను పరస్పర అంగీకారంతో అక్కడికక్కడే పరిష్కరిస్తామని.దీనికి చట్టపరమైన గుర్తింపు ఉంటుందని ఆయన చెప్పారు.
ఎన్ఆర్ఐల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో పీసీఎస్ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని సీఎం భగవంత్ మాన్ను అభ్యర్ధించాలని నిర్ణయించామని కుల్దీప్ తెలిపారు.ఎన్ఆర్ఐ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ధాలివాల్ తెలిపారు.
బాధిత ప్రవాసులకు ఉపశమనం కలిగించేందుకు .ఎన్ఆర్ఐల అనుమతి లేకుండా గిర్దావరి మార్పును నిరోధించే చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.