కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.కొన్ని దేశాలు ఆంక్షలు సడలిస్తున్నప్పటికీ.
విమానం ఎక్కాలంటే సవాలక్షా కండీషన్లు పెడుతున్నాయి.ఇక భారత ప్రభుత్వం సైతం అంతర్జాతీయ విమాన సేవలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే వారు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది.ఇదే సమయంలో భారత్ నుంచి వివిధ దేశాలకు వస్తున్న వారికి సైతం ఆయా దేశాలు కొన్ని ఆంక్షలు విధించాయి.
వీటిలో ప్రధానమైనది కరోనా నెగిటివ్ రిపోర్ట్.కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వస్తేనే విమానయాన సంస్థలు ప్రయాణానికి అనుమతిస్తున్నాయి.
దీనిని అవకాశంగా తీసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.కోవిడ్ రిపోర్ట్ ఇప్పిస్తామంటూ ఎన్ఆర్ఐల వద్ద నుంచి డబ్బులు దండుకుంటున్నారు.ఈ నేపథ్యంలో పంజాబ్లోని మొగా సివిల్ ఆసుపత్రిలో వైద్యులు, ఏజెంట్లు కలిసి సాగిస్తున్న దందా వెలుగులోకి వచ్చింది.లూధియానా జిల్లాలోని దేహద్కా గ్రామానికి చెందిన చరణ్ జిత్ సింగ్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆగస్టు 4న హాంకాంగ్కు వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు.
అయితే విమానం ఎక్కాలంటే కరోనా నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కావడంతో చరణ్ జిత్ సింగ్ అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆగస్టు 2న మొగాలోని సివిల్ ఆసుపత్రికి వెళ్లాడు.
అయితే భారీ వెయిటింగ్ ఉండటంతో ఈ రోజు పరీక్షలు నిర్వహించలేమంటూ అక్కడి వైద్యులు చరణ్ జిత్కు చెప్పారు.దీంతో వారు ఆందోళనకు గురయ్యారు.సరిగ్గా ఇదే సమయంలో ఓం ప్రకాశ్ అనే ఏజెంట్ వారి వద్దకు వచ్చి మనిషికి రూ.3,500 చొప్పున తొమ్మిది మందికి రూ.31,500 ఇచ్చినట్లయితే తాను ఈరోజే పరీక్షలు చేయిస్తానని చెప్పాడు.ప్రయాణానికి గడువు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చరణ్ జిత్ అతనికి డబ్బులు ఇచ్చాడు.అయితే దీని వెనుక పెద్ద ముఠా వుందని గమనించిన చరణ్ జిత్ లూధియానా డిప్యూటీ కమీషనర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
తన లాగా మరో ఎన్ఆర్ఐ ఇలాంటి ముఠా చేతికి చిక్కకూడదని.ఆసుపత్రి ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే మరిన్ని ఆధారాలు లభిస్తాయని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ క్రమంలో ఆగస్టు 19న ఓం ప్రకాశ్ డిప్యూటీ కమీషనర్కు అఫిడవిట్ సమర్పించాడు.తాను 48 మంది ఎన్ఆర్ఐల నివేదికలను ముందుగా పొందడానికి జిల్లా ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ నరేశ్ ఆమ్లాకు 1.7 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు.అలాగే వీరిలో ఎవరికైనా పాజిటివ్గా తేలినట్లయితే వారికి నెగిటివ్ వచ్చినట్లుగా టెస్ట్ రిపోర్ట్ ఇస్తానని ఆమ్లా తనకు హామీ ఇచ్చారని ఓంప్రకాశ్ వెల్లడించాడు.
ఇందుకు సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను కూడా ప్రకాశ్ డిప్యూటీ కమీషనర్కు అందజేశాడు.దీనిపై స్పందించిన డిప్యూటీ కమీషనర్ సందీప్ హన్స్.ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలను డాక్టర్ ఆమ్లా ఖండించారు.
అసలు తాను ఇంత వరకు ఓమ్ ప్రకాశ్ను కలవలేదని స్పష్టం చేశారు.