రెండు మూడు నెలల వరకు ఎన్ఆర్ఐలు ఊళ్లలోకి వస్తున్నారంటూ వారికి రాచమర్యాదలు, ఘనస్వాగతాలు ఉండేవి.వాళ్లను చూసేందుకు జనం కూడా ఎగబడేవారు.
ఎప్పుడైతే కరోనా ఇండియాలోకి ఎంటరై జనాన్ని వణికిస్తోంది అప్పటి నుంచి ప్రవాస భారతీయులు అంటరానివారుగా మారిపోయారు.భారతదేశంలోకి ఎన్ఆర్ఐల ద్వారానే కరోనా వ్యాప్తి చెందుతోందని టీవీల్లోనూ, పత్రికల్లోనూ చూస్తున్న జనం కొన్ని వూళ్లలో ప్రవాస భారతీయులను రానివ్వడం లేదు.
ఒకవేళ వచ్చినా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండనీయకపోతే పోలీసులకు, అధికారులకు సమాచారం అందించి మరి పట్టిస్తున్నారు.
వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు కరోనా భయంతో మాతృదేశానికి పరుగులు తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి సుమారు 90 వేల మంది ప్రవాస భారతీయులు వచ్చినట్లు పంజాబ్ ప్రకటించింది.కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా తమ రాష్ట్రానికి రూ.150 కోట్ల నిధులు కేటాయించాల్సిందిగా పంజాబ్ సర్కార్ భారత ప్రభుత్వాన్ని కోరింది.ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిధు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హార్షవర్థన్ లేఖ రాశారు.
మార్చి నెలలో 90,000 మంది ప్రవాస భారతీయులు పంజాబ్కు వచ్చారని, వీరిలో చాలా మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయని ఆయన తెలిపారు.రోజు రోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతున్నందున వారికి చికిత్స అందించేందుకు గాను రూ.150 కోట్లు నిధులు కేటాయించాలని సిద్ధూ కోరారు.కాగా పంజాబ్లో ఇప్పటి వరకు 23 మందికి కోవిడ్ 19 పాజిటివ్గా తేలగా.
ఒకరు మరణించారు.
మరోవైపు పలు దేశాల్లో ఉన్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో భారతదేశానికి తీసుకొచ్చింది.
అయితే అన్ని దేశాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుండటం, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో పలు దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.లండన్లో చిక్కుకుపోయిన పలువురు భారతీయులు తమను ఆదుకోవాలంటూ ఏకంగా భారత హైకమీషనర్ కార్యాలయాన్ని ఆక్రమించేయడం పరిస్ధితి తీవ్రతకు అద్దం పడుతోంది.