ప్రపంచాన్ని కరోనా రక్కసి వణికిస్తున్న విషయం విదితమే.ఈ మహమ్మారికి ఎలాంటి మందు లేకపోవడం తో ముందు జాగ్రత్త చర్యలను తప్పక పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీని కోసం శానిటైజర్లు, మూతి,ముక్కును కప్పి ఉంచేలా మాస్కులను వాడాల్సిన పరిస్థితి నెలకొంది.దీనితో ప్రతి ఒక్కరూ కూడా విధిగా వీటన్నిటిని వాడాలి అని ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి.
దీంతో బయటకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరు బట్టతో తయారు చేసిన మాస్క్ ధరించి వెళ్తున్నారు.ఎంతటి ధనవంతులైనా వీటిని వాడక తప్పడం లేదు.
అయితే అందరికీ భిన్నంగా ఉండాలనో, లేదంటే బంగారు మాస్క్ ధరించాలి అని కోరిక కలిగో తెలియదు కానీ పూణే కి చెందిన ఒక వ్యక్తి మాత్రం బంగారు మాస్క్ ను ధరించి అందరిలో ప్రత్యేకంగా నిలిచాడు.పింప్రి-చిన్చ్వాడ్ ప్రాంతానికి చెందిన శంకర్ కురాడే అనే వ్యక్తి బంగారంతో మాస్క్ తయారు చేయించుకున్నాడు.దీని కోసం 2.89 లక్షలు ఖర్చు చేశాడు.బయటకు వెళ్లిన ప్రతిసారి దీన్నే పెట్టుకుంటూ ఉన్నాడు.ఇది చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు.అయితే బంగారు మాస్క్ పెట్టుకుంటే ఎలా ఊపిరి ఆడుతుంది అని ఆలోచిస్తున్నారేమో.కానీ ఆ బంగారు మాస్క్లో సన్నని రంధ్రాలు ఉండటంతో అతనికి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండటం లేదు.
అయితే ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఈ బంగారు మాస్క్ ఎంత వరకు వైరస్ను కట్టడి చేస్తుందని అనేది మాత్రం ప్రశ్నార్థకమే.
ఇప్పటి వరకు వైద్యులు కూడా ఎన్ 95, సర్జికల్ మాస్కులు పెట్టుకోవాలని సూచించారు.
అలాంటిది ఇలా బంగారు మాస్క్ లు పెట్టుకోవడం వల్ల ఈ వైరస్ నుంచి ఎంతవరకు ప్రొటెక్షన్ లభిస్తుంది అన్నది మాత్రం తేలాల్సి ఉంది.అయితే శంకర్ కురాడే కి ఒక్క బంగారు మాస్క్ మాత్రమే కాకుండా ఒంటిపై బంగారు గొలుసులు, ఉంగరాలు కలిపి దాదాపు 3 కిలోల వరకు బంగారు ఆభరణాలు ధరించి ఉండటం విశేషం.
కాగా ఇప్పటి వరకు పింప్రి-చిన్చ్వాడ్ ప్రాంతంలో 3,284 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.