చాలా మందికి వారి జీవనాధారం కోసం ఏవేవో వ్యాపారాలు చేస్తుంటారు.అయితే ఆ వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి.
ఆ విధంగా నైపుణ్యం కలిగిన వారు వ్యాపారంలో రాణిస్తారు.ఈ తరహాలోనే నిజామాబాద్ కి చెందిన అన్నదమ్ములు వారి జీవనాధారం కోసం ఒక పంక్చర్ దుకాణంను పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు.
అయితే వ్యాపారంలో వారికి పెద్దగా కలిసి రాకపోవడంతో వారు వ్యాపార అభివృద్ధిని చేసుకోవడం కోసం ఒక వినూత్నమైన ఆలోచన చేసి ప్రస్తుతం ఎంతో అభివృద్ధిలో ఉన్నారు.అయితే వారి ఆలోచనా విధానం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…. నిజామాబాద్ జిల్లాకు చెందిన అబ్దుల్ అజీం, అబీబ్ అనే అన్నదమ్ములు అర్సపల్లి శివారులో పంక్చర్ దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.అయితే వారు అనుకున్న విధంగా వారి వ్యాపారం జరగకపోవడంతో కొంత నిరాశ చెందారు.
ఒక రోజు వీరి దుకాణానికి ఒక వ్యక్తి బైక్ పంక్చర్ కావడంతో చాలా దూరం నుంచి వాహనాన్ని తోసుకుంటూ తమ షాప్ కి వెళ్ళాడు.ఆ విధంగా అంత దూరం నుంచి వచ్చిన ఆ వ్యక్తిని చూడగానే ఈ అన్నదమ్ములకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది.
ఆ వాహన దారుడిని చూడగానే ఆ అన్నదమ్ములకు వచ్చిన ఆలోచన “మొబైల్ పంక్చర్ దుకాణం”.ఈ ఆలోచన వీరికి రావడమే ఆలస్యం వెంటనే ఆచరణలో పెట్టారు.ఒక మినీ వ్యాన్ తీసుకొని అందులో ఒక గాలి మిషన్, జనరేటర్,పంక్చర్వేయడానికి కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేసుకొని తమకు తెలిసిన వాళ్ళందరికీ వారి ఫోన్ నెంబర్లు ఇచ్చి దారి మధ్యలో ఎక్కడైనా తమ వాహనాలు ఇబ్బంది పెడితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి అంటూ ఫోన్ నెంబర్లు ఇచ్చారు.ఈ విధంగా చేయటం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటే ఒక ఫోన్ చేస్తే చాలు వెంటనే వీళ్ళు అక్కడకు వాలిపోయి వాహన దారుల సమస్యలను తీరుస్తూ ఉంటారు.
ఈ విధమైన ఆలోచన వల్ల అటు వాహనదారుల సమస్యలు తొలగిపోవడమే కాకుండా వీరి వ్యాపారం కూడా ఎంతో అభివృద్ధి చెందిందని ఈ అన్నదమ్ములు తెలియజేశారు.