జమ్మూ కశ్మీర్లో భారత ఆర్మీ కి పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది.ఆర్మీ ని లక్ష్యంగా చేసుకొని పుల్వామా తరహా దాడి ఘటనకు ఉగ్రవాదులు మరోసారి కుట్ర పన్నగా భద్రతా బలగాలు భగ్నం చేశారు.
పుల్వామా తరహా లో దాడి చేసి భారత ఆర్మీ పై దెబ్బకొట్టాలని చేసిన కుట్రను ముందుగానే పసిగట్టిన భద్రతా బలగాలు పెను ముప్పును తప్పించాయి.గురువారం ఉదయం పుల్వామా జిల్లాలోని రాజ్పోరాలో ఐఈడీ బాంబులతో నిండి ఉన్న కారును గుర్తించిన భద్రతా బలగాలు ముందుగానే ఆ శాంత్రో కారును సీజ్ చేశారు.
అనంతరం ఆ బాంబులను నిర్వీర్యం చేసి పేలుడు ముప్పును తప్పించారు.దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.అప్రమత్తమైన భద్రతా బలగాలు ముష్కరుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.భారత ఆర్మీ కాన్వాయ్ వెళ్లే మర్గమైన అయెన్గుండ్ ప్రాంతంలో ఓ సాంట్రో కారు అనుమానస్పదంగా కనిపించింది.
అయితే అనుమానం కలగడం తో వెంటనే దాన్ని ఆపిన భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు.దాంట్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు కనిపించడం తో అప్రమత్తమై వాటిని నిర్మూలన చేశారు.
ఆ కారును హిజ్బుల్ ఉగ్రవాది ఒకరు నడుపుతున్నట్టుగా అధికారులు గుర్తించారు.
భద్రతా బలగాలు కారును ఆపిన వెంటనే కాల్పులు జరుపుతూ అతడు తప్పించుకున్నట్లు తెలుస్తుంది.
దీనితో కారును అదుపులోకి తీసుకొని బాంబులను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు ఇప్పుడు ఆ ముష్కరులను పట్టుకొనే పనిలో పడ్డారు.కాగా గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.
ఆర్మీని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపుతున్నారు.ఎప్పటికప్పుడు భారత ఆర్మీ తిప్పికొడుతున్నప్పటికీ ఉగ్రవాదులు మాత్రం తమ ప్రయత్నాలు మానుకోవడం లేదు.