హాంగ్ కాంగ్ నగరం గత నాలుగు వారాలుగా ఆందోళనలు,అల్లర్ల తో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా సోమవారం కూడా పెద్ద ఎత్తున హింస చెలరేగింది.
అనుమానిత నేరస్తులను చైనాకు అప్పగించేందుకు అనువుగా ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ముసుగులు వేసుకుని, హెల్మెట్లు ధరించి పార్లమెంటులోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడమే కాకుండా పార్లమెంటు భవనంలోని నేతల పటాలను చించివేసి పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక నినాదాలు చేస్తూ గోడలపై రంగులు పూస్తూ నానా భీభత్సం సృష్టించారు.
దీనితో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించారు.
బ్రిటిష్ పాలన ముగిసి హాంకాంగ్ ను తిరిగి చైనాకు అప్పగించి 22 ఏళ్లయిన రోజే జరిగిన విధ్వంసమిది.సుమారు నాలుగైదు గంటల అనంతరం పోలీసులు పార్లమెంటును తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ తాజా ఘర్షణల్లో సుమారు 53 మంది గాయపడినట్లు తెలుస్తుంది.మరోపక్క ఈ విధంగా పార్లమెంట్ లో హింస చెలరేగడాన్ని నగర చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ ఖండించారు.
నేరస్తుల అప్పగింత బిల్లులో కొన్ని సవరణలు చేసి ఆందోళనకారులకు నేతృత్వం వహిస్తున్న ఫ్రంట్ నేతలతో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తున్న ఈ సమయంలో ఈ విధంగా నిరసనకారులను ఫ్రంట్ నాయకులు రెచ్ఛగొట్టడం ఎంతవరకు సమంజసమంటూ ఆమె ప్రశ్నించారు.
పోలీసులు సకాలంలో స్పందించి ఈ హింసను, అల్లర్లను అదుపు చేయడం హర్షణీయమని ఆమె వ్యాఖ్యానించారు.అనుమానిత నేరస్తులను చైనా కు అప్పగించడానికి వీలుగా హాంగ్ కాంగ్ ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.అయితే ఆ బిల్లు ప్రవేశ పెట్టినప్పటి నుంచి కూడా హాంగ్ కాంగ్ లో నిరసనలు వెల్లువెత్తాయి.
వెంటనే ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రజలు భారీ ఎత్తున రోడ్లపైకి తరలి వచ్చి మరి నిరసలు తెలుపుతున్నారు.ఈ క్రమంలో భారీ గా హింస కూడా చెలరేగడం తో హాంగ్ కాంగ్ సర్కార్ వెనక్కి తగ్గింది.
తాత్కాలికంగా ఆ బిల్లును నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం తో అక్కడ పరిస్థితులు కొంత వరకు అదుపులోకి వచ్చాయి.