అమెరికాలో పోలీసుల చేతిలో ఓ నల్లజాతీయుడు మరణించడం అక్కడ ఉద్రిక్తతలకు కారణమైంది.మిన్నియాపోలీస్ నగరానికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని ఫోర్జరీ కేసులో నలుగురు పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం నిందితుడిని రోడ్డుపై పడుకోబెట్టి అతని మెడపై డెరెక్ చావిన్ అనే పోలీస్ అధికారి కాలు నొక్కి పెట్టాడు.తనకు ఊపిరి ఆడటం లేదు.
ప్లీజ్ అని నిందితుడు మొత్తుకున్నప్పటికీ చావిన్ మాత్రం వినలేదు.కొద్దిసేపు మెడపై మోకాలు పెట్టి ఉంచడంతో జార్జ్ ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనను అక్కడి ప్రజలు సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.ఈ ఘటనకు బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వర్గం భగ్గుమంది.
భవనాలు, వాహనాలను తగలబెట్టారు.పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్ధితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించినా కుదర్లేదు.
ఆందోళనకారులు శాంతించాలని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా విజ్ఞప్తి చేసినా పరిస్ధితిలో మార్పులేదు.
అయితే ప్రజాగ్రహానికి స్పందించిన మిన్నియాపోలీస్ మేయర్ జాకొబ్ ఫ్రే.నల్ల జాతీయుడి మృతికి కారణమైన డెరెక్ చావిన్, థామస్ లేన్, టౌ థౌ, జే అలెగ్జాంర్ క్యూంగ్ అనే పోలీసు అధికారులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.అయినప్పటికీ ఆందోళనకారులు శాంతించలేదు.నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి, వారికి ఉరిశిక్ష విధించాల్సిందేనని పట్టుబట్టారు.2014లో నల్లజాతీయుడైన ఎరిక్ గార్నెర్ను హతమార్చినట్లుగానే.ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ను చంపారని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై హెన్నెపిన్ కౌంటీ అటార్నీ మైక్ ఫ్రీమాన్ స్పందించారు.ఈ కేసును మిన్నెసోటా బ్యూరో ఆఫ్ క్రిమినల్ అప్రెహెన్సివ్, ఎఫ్బీఐ సంయుక్తంగా ఈ ఘటనపై విచారణ చేస్తున్నాయని చెప్పారు.పూర్తి విచారణ జరిపి న్యాయం చేసేందుకు తమకు కాస్త టైమ్ ఇవ్వండని మైక్ ఫ్రీమాన్ ఆందోళనకారులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు.