థియేటర్లు మూడు నెలలుగా మూత పడి ఉన్నాయి, మరో రెండు మూడు నెలల వరకు సరిగ్గా ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.దాంతో ఓటీటీలో చిన్న సినిమాలను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అందులో భాగంగానే పలు సినిమాలు ఇప్పటికే ఓటీటీ ద్వారా విడుదల అయ్యాయి.మరికొన్ని కూడా ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్దం అవుతున్నాయి.
ఈ సమయంలో ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలకు కొత్త భయం పట్టుకుంది.
ఇప్పటి వరకు ఓటీటీలో విడుదల అయిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా సూపర్ హిట్ టాక్ దక్కించుకోలేదు.
చెత్త సినిమాలనే ఇలా ఓటీటీ ద్వారా వదులించుకుంటున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో కొత్త సినిమాలను కూడా ప్రేక్షకులు అదే దృష్టితో చూస్తారా అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.
అందుకే కొత్త సినిమాలను వెంటనే ఓటీటీలో విడుదల చేయాలనుకోవడం లేదు.ఓటీటీ ప్లాట్ ఫామ్ మీద ఏదో ఒక సినిమా సక్సెస్ కొడితే అప్పుడు విడుదలకు నిర్మాతలు సిద్దం అయ్యే అవకాశం ఉంది.
భారీ అంచనాల నడుమ రూపొందిన పెంగ్విన్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఓటీటీలో విడుదల అయిన ఆ సినిమా నిరాశ పర్చింది అనే టాక్ వచ్చింది.సినిమాలో హీరోయిన్గా నటించిన కీర్తి సురేష్కు నటిగా మంచి మార్కులు అయితే పడ్డాయి.కాని హీరోయిన్గా ఆమెకు సక్సెస్ను తెచ్చి పెట్టలేదు.అందుకే ఓటీటీలో విడుదల విషయంలో నిర్మాతలు వెనుక ముందు ఆడుతున్నారు.