గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని పలువురు సినీ నిర్మాతలు టికెట్ల రేట్లు పెంపు విషయంపై ఆంధ్ర ప్రదేశ్ మినిస్టర్ పేర్ని నాని తో భేటీ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఇందులో భాగంగా సినిమా టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునేందుకు యాప్ ని రూపొందిస్తే తప్పుడు కలెక్షన్లను అరికట్టడంతో పాటు చిన్నాచితక సినీ నిర్మాతలకు ఉపయోగం చేకూరుతుందని అంతేకాకుండా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించాలని చర్చించారు.
దీంతో తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించాడు.
ఇందులో భాగంగా కొంతమంది సినీ నిర్మాతలు సినిమా ఇండస్ట్రీలో ఫిలింఛాంబర్ తరఫున మాట్లాడుతున్నామంటూ డబుల్ గేమ్స్ ఆడుతున్నారని అంతేకాకుండా తమ అభిప్రాయాలని ఫిలిం ఛాంబర్ అభిప్రాయాలుగా మారుస్తూ తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించాడు.
అంతేకాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1200 థియేటర్లలో ప్రస్తుతం 1000 కి పైగా థియేటర్లు తెరుచుకున్నాయని కానీ ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ తో చెప్పకుండా దాచిపెట్టి మాట్లాడారని అలాగే సినిమా థియేటర్ల విషయం ఫిలిం ఛాంబర్ కి గానీ, కౌన్సిల్ కి కానీ సంబంధం లేదని ఇలాంటి విషయాలను అనవసరంగా కొంత మంది నిర్మాతలు ఇష్యూ చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశాడు.అలాగే ఈ ఇష్యూలోకి పవన్ కళ్యాణ్ ని మిస్ లీడ్ చేసి పవన్ కళ్యాణ్ కి మరియు గవర్నమెంట్ కి మధ్య చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రముఖ సినీ దర్శకుడు మరియు నటుడు పోసాని కృష్ణ మురళి పై దాడికి యత్నించిన విషయం కూడా స్పందిస్తూ మెగా హీరో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఖండించాలని కోరాడు.ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో జరిగే పరిణామాలకి మంచి జరుగుతుందని లేకపోతే అభిమానులు ఇలాంటి దాడులు చేయడం వల్ల హీరోలకి చెడ్డ పేరు వస్తుందని కూడా సూచించాడు.అలాగే పవన్ కళ్యాణ్ కి తప్పుడు సమాచారం అందించి ప్రభుత్వంపై ఉసిగొల్పిన వారు ప్రస్తుతం తనతో సినిమాలు చేస్తున్న సినీ నిర్మాతలేనని కాబట్టి వారి విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అతడికే వదిలేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.అలాగే సినిమా పరిశ్రమలో పెద్ద చిత్రాల నిర్మాతలు మాత్రమే కాకుండా తనలాంటి చిన్నాచితక చిత్రాలను నిర్మించే నిర్మాతలు కూడా బ్రతకాలని కాబట్టి గవర్నమెంటు టికెట్ల రేట్లు పెంపు విషయంపై సానుకూలంగా స్పందించాలని కోరాడు.