లెజెండరీ సంగీత దర్శకుడుగా, సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టే ఎంతో మందికి మార్గదర్శకుడుగా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా కనిపిస్తాడు.అతను స్వపరిచిన పాటలు ఇప్పటికి సౌత్ ఇండియన్ ప్రేక్షకులని అలరిస్తూ ఉంటాయి.
ప్రశాంతత కోసం ఇళయరాజా పాటలు ప్రతిరోజు వినేవారు కూడా ఉన్నారు.ప్రజల హృదయాలలో సంగీత కళానిధిగా అంతగా గుర్తింపు ఏర్పరుచుకున్న ఇళయరాజా నిజజీవితంలో వివాదాలతో సహవాసం చేస్తూ ఉంటారు.
తన పాటలు నేటితరం సంగీత దర్శకులు కాపీ చేస్తున్నారని బహిరంగంగానే విమర్శలు చేస్తారు.తన ప్రమేయం లేకుండా తన పాటలు ఇష్టానుసారంగా వాడుకోవడంపై కాపీ రైట్స్ కేసులు కూడా చాలా మంది మీద పెట్టారు.
తాజాగా మరోసారి ఆయన ఎల్వీ ప్రసాద్ మనవడుపై కేసు పెట్టారు.చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్లో ఉన్న తన రూమ్ను ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ ఖాళీ చేయించడానికి దౌర్జన్యం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
40 ఏళ్ల కింద ఇళయరాజా కోరిక మేరకు ఎల్వీ ప్రసాద్ చెన్నై ప్రసాద్ స్టూడియోస్లోనే తనకంటూ ప్రత్యేకంగా ఓ రికార్డింగ్ థియేటర్ కట్టించి ఇచ్చాడు.అందులోనే ఇళయరాజా పాటల కంపోజింగ్ చేసుకుంటున్నాడు.
ఇప్పుడు ఈ రికార్డింగ్ థియేటర్ ఖాళీ చేయించాలని సాయి ప్రసాద్ ప్రయత్నిస్తున్నాడని ఇళయరాజా కేసు పెట్టాడు దీనిపై ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఇళయరాజాపై సంచలన వాఖ్యలు చేశారు.ఇళయరాజా అరాచకాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయని ఆయన ఆరోపించాడు.
ఓ సినిమాకు పాట కంపోజ్ చేసినపుడు దాని సర్వహక్కులు ప్రతీ రూపాయి ఖర్చు పెట్టిన నిర్మాతకే ఉంటాయని, కానీ ఇళయరాజా మాత్రం అలా కాకుండా తన పాటలు బయట ఎవరు పాడినా కూడా కేసులు వేస్తానని, దాని రైట్స్ తన దగ్గరే ఉన్నాయని చెప్పడం బాగోలేదని కాట్రగడ్డ ప్రసాద్ విమర్శించారు.ఇళయరాజాకు క్రేజ్ ఉన్న రోజుల్లో నిర్మాతలను భయపెట్టి ఆడియో రైట్స్ కూడా రాయించుకున్నాడని, అలా సొంత ఆడియో కంపెనీ ఓపెన్ చేసి ఇప్పుడు లబ్ధి పొందుతున్నాడని చెప్పాడు.
ఇళయరాజా స్వయంగా వెళ్లి ఎల్వీ ప్రసాద్ను అడిగితే ఆయనే ఓ రికార్డింగ్ థియేటర్ కట్టించి ఇచ్చాడని గుర్తు చేసాడు.దానిపై అతనికి ఎలాంటి హక్కులు లేవని పేర్కొన్నారు.
ఇళయరాజా వేసిన కేసు నిలబడదని ఈ సందర్భంగా ప్రసాద్ తెలిపారు.