పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.కరోనా, లాక్ డౌన్ వల్ల మే నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
లాక్ డౌన్ వల్ల వకీల్ సాబ్ షూటింగ్ వాయిదా పడగా కొన్ని రోజుల క్రితం మళ్లీ షూటింగ్ ప్రారంభమైంది.అయితే ఈ సినిమా దిల్ రాజును తెగ టెన్షన్ పెడుతోందని తెలుస్తోంది. చాలా సంవత్సరాల నుంచి నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నాలు చేయగా వకీల్ సాబ్ తో ఆ కోరిక ఎట్టకేలకు నెరవేరింది.భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా కరోనా వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కేంద్రం నిబంధనల నేపథ్యంలో థియేటర్లలో 50 శాతం సీటింగ్ కు మాత్రమే అనుమతివ్వడంతో బయ్యర్లు ఈ సినిమాను ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేసే పరిస్థితి లేదు.
దీంతో దిల్ రాజు ఈ సినిమా విడుదల విషయంలో టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.గతంలో ఓటీటీ ఆఫర్ వచ్చినా దిల్ రాజు పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా కావడంతో సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి ఆసక్తి చూపలేదు.
బయ్యర్లు తక్కువ రేటు ఆఫర్ చేస్తే పరిస్థితులు చక్కబడిన తరువాతే సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నారని తెలుస్తోంది.నిర్మాతగా వరుస విజయాలతో దూసుకెళుతున్న దిల్ రాజుకు వకీల్ సాబ్ రూపంలో కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి.