రాజకీయ రంగంలో, సినీ రంగంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.పలు సందర్భాల్లో విమర్శలు చేసుకుని బద్ధ శత్రువులుగా ఉన్నవాళ్లు తరువాత కాలంలో స్నేహితులుగా మారడం చాలానే చూశాం.
అదే విధంగా గతంలో బండ్ల గణేష్, రోజా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోగా తాజాగా ట్విట్టర్ వేదికగా రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు.కరోనా సోకిన తరువాత తనలో చాలా మార్పు వచ్చిందని చెప్పిన బండ్ల గణేష్ అప్పటినుంచి వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటున్నారు.
తాజాగా ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో రోజాతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.చాలా కాలం తరువాత సినీ నటి, ఏపీపీఐసీ ఛైర్ పర్సన్, ఎమ్మెల్యే రోజాను కలిశానని ఆమె కెరీర్ విషయంలో విజయవంతంగా ముందుకు సాగాలని, మంచి ఆరోగ్యంతో పాటు ఐశ్వరంతో సంతోషకరమైన జీవనం సాగించాలని కోరుకుంటున్నానని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
బండ్ల్గ గణేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో ఒక టీవీ ఛానల్ లో బండ్ల గణేష్, రోజా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే.
అప్పటినుంచి బండ్ల గణేష్, రోజా మధ్య మాటలు లేవని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది.జనసేన అధినేత, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన నేపథ్యంలో రోజా, బండ్ల గణేష్ మధ్య మాటల యుద్ధం జరిగింది.
అయితే కొందరు నెటిజన్లు మాత్రం నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చినంత మాత్రాన వీళ్లిద్దరూ కలిసిపోయినట్లు భావించరాదని చెబుతున్నారు.
ప్రస్తుతం రోజా ఎమ్మెల్యేగా నగరి నియోజకవర్గ పనులతో బిజీగా ఉండటంతో పాటు ఏపీపీఐసీ ఛైర్ పర్సన్ గా, జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
బండ్ల గణేష్ నిర్మాతగా ఒక సినిమాలో నటించడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.