జగనన్న బాటలోనే వైఎస్ షర్మిల అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.ఎంత బలం, బలగం ఉన్నా, సరైన రాజకీయ వ్యూహం లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని జగన్ నుంచి షర్మిల గ్రహించినట్లుగా కనిపిస్తున్నారు.
వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ నియమించుకున్న తర్వాత ఒక్కసారిగా ఆ పార్టీలో ఊపు రావడం , అఖండ మెజార్టీ తో అధికారంలోకి రావడం వంటివన్నీ జరిగిపోయాయి.ఈ క్రెడిట్ జగన్ ఒక్కరిదే కాదు.
అందులో ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఉంది.ఇదే విధంగా షర్మిల కూడా ప్రశాంత్ కిషోర్ సేవలు పొందాలని ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవడంతో, అదే టీంలో పని చేసిన ప్రియా అనే ఆమెను షర్మిల తమ పార్టీ రాజకీయ వ్యూహ కర్త గా నియమించుకున్నారు.
అయితే ఈ ప్రియ ఎవరా అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.ఈమె తమిళనాడు ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె.అంతేకాదు తమిళనాడు లోని ఓ ప్రధాన మీడియాకు ఆమె అధినేతగా ఉన్నారు.తాజాగా ప్రియా లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిలను కలిశారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాతో పాటు, పార్టీ వ్యవహారాలపై షర్మిలకు వ్యూహకర్తగా సలహాలు సూచనలు ఆమె చేయబోతున్నారు.తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించబోతున్నారు.
ఆ తర్వాత తెలంగాణ అంతటా పర్యటించి, వచ్చే ఎన్నికల నాటికి బాగా బలం పుంజుకుని అధికారంలోకి రావాలని ఆమె చూస్తున్నారు.
అయితే పరిస్థితులు ఊహించనంత స్థాయిలో లేకపోవడంతో, తప్పనిసరిగా వ్యూహకర్త అవసరమనే సూచనలు ఆమెకు అందడంతో ప్రశాంత్ కిషోర్ టీమ్ ను ఆమె సంప్రదించడంతోనే ప్రియను వ్యూహకర్తగా పంపించినట్లు తెలుస్తోంది.
పూర్తిగా షర్మిల పార్టీ రాజకీయ వ్యవహారాలన్నీ ఇక పై ప్రియా టీమ్ చూసుకుంటుంది.మీడియా ప్రకటనలు, సోషల్ మీడియాతో పాటు, తెలంగాణ ప్రజల్లో ఏ విధంగా బలం పెంచుకోవాలనే విషయాలపై ఎప్పటికప్పుడు ప్రియా టీమ్ షర్మిలకు సూచిస్తారు.
షర్మిల తన సొంత అజెండాను పక్కన పెట్టి పూర్తిగా ప్రియా టీమ్ సూచన మేరకు నడవాలని నిర్ణయించుకున్నారట.
ఎప్పటికప్పుడు తెలంగాణలో పరిస్థితులను అంచనా వేయడంతో పాటు, పార్టీపై ప్రజల్లో సానుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాలపై ఎప్పటికప్పుడు ప్రియా టీమ్ సర్వేలు నిర్వహించి, దానికి అనుగుణంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలి ? ఏవిధంగా మాట్లాడాలి అనే విషయాలపై షర్మిలకు అవగాహన కల్పించబోతున్నారు.