మొదట్లో ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో వైసిపి పోరాటం చేసింది.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉంచకూడదని, ఆయన హయాంలో ఎన్నికలకు వెళితే టీడీపీకి మేలు చేసే విధంగా వ్యవహరించి వైసీపీకి నష్టం చేకూరుస్తారని రకరకాల మార్గాల్లో తమ బాధను వ్యక్తం చేసింది.
చివరకు ఎన్నికల కమిషనర్ ను మార్చి కనగరాజ్ అనే వ్యక్తిని గవర్నర్ ద్వారా నియమించుకున్నా, కోర్టు జోక్యంతో మళ్లీ నిమ్మగడ్డ ఏపీ ఎన్నికల అధికారి గా నియమించబడ్డారు.ఆయన ఆధ్వర్యంలోనే ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లారు.
వైసిపికి అనుకున్న మేర ఎన్నికల ఫలితాలు వచ్చాయి.మొదట్లో ఉన్నంత కఠిన వైఖరితో నిమ్మగడ్డ లేరు అని, వైసిపి విషయంలో సానుకూలంగా ఉన్నారని, అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఏ చర్యలూ తీసుకోవడం లేదు అని అంతా అనుకున్నారు.
అయితే అధికారులను పనిచేయకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుకున్నారని ఆరోపిస్తూ ప్రివిలేజ్ కమిటీ కి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు.తమను హౌస్ అరెస్ట్ చేయించడంతో పాటు, మీడియాతో మాట్లాడవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసి, తమ హక్కులకు భంగం కలిగించారు అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
దీనిని ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ రిఫర్ చేశారు.అప్పట్లో నిమ్మగడ్డ సైలెంట్ అయిపోవడం, వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహారాలు చేయకపోవడం, ఆయన సానుకూలంగా ఉన్నట్లుగా వ్యవహరించడం వంటి కారణాలతో ఇక ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డ పై ఏ చర్యలు తీసుకోదు అని అంతా అనుకున్నారు.
కానీ అకస్మాత్తుగా ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నోటీసు ఇవ్వాలని కమిటీ భావించడం అందరిని ఆశ్చర్యపరిచింది.మరో 13 రోజుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, ఈ కమిటీ యాక్షన్ లోకి దిగడం ఉత్కంఠ రేపుతోంది.