ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన నేరస్తులంతా తప్పించుకోవడానికి యూకే బాట పడుతున్నారు.దీంతో విదేశీ నేరస్తులకు యూకే స్వర్గధామంగా మారింది.
ఉదాహరణకు మనదేశానికి చెందిన ఆర్ధిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ తదితరులు లండన్లో ఉన్నారు.వీరిని భారతదేశానికి రప్పించేందుకు మన దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
అయితే విదేశీ నేరస్తులకు తమ దేశం అడ్డాగా మారిపోవడంతో యూకే ప్రభుత్వం ఈ అపవాదును తప్పించుడానికి నడుంబిగించింది.ఈ క్రమంలో ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న విదేశీ నేరస్తులు దేశంలో అడుగుపెట్టకుండా నిషేధం విధించింది.
జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న పాయింట్ బేస్డ్ సిస్టమ్ వివరాలను యూకే హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ సోమవారం తెలపనున్నారు.ఈ కొత్త నిబంధనలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వారితో పాటే ఈయూ పౌరులకు సైతం వర్తిస్తాయి.
కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం ప్రకారం బ్రిటన్లోకి ప్రవేశించే తక్కువ నైపుణ్యం కలిగిన వలసదారుల సంఖ్యను పరిమితం చేయడానికి రూపొందించబడింది.అయితే అధిక నైపుణ్యం కలిగిన కార్మికులకు యూకే వీసాలు పొందడం సులభతరం చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.యూకేలో నివాసం, పనిచేయాలనుకునే వ్యక్తులు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 70 పాయింట్లు పొందాలి.నిర్దిష్ట స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడటం, యజమాని నుంచి ఆఫర్ లెటర్, కనీస వేతన పరిమితిని పాయింట్ల కింద పరిగణనలోనికి తీసుకుంటారు.