అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హడావుడి నెలకొంది.అన్ని పార్టీలు గ్రేటర్ ఎన్నికలను ఆషామాషీగా అయితే తీసుకోవడం లేదు.
ఈ ఎన్నికల్లో గెలిచి చూపించి తమ సత్తా చాటుకుని, రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలనే విధంగా ముందుకు వెళుతున్నాయి.అసలు ప్రస్తుతం నెలకొన్న ఎన్నికల వార్ చూస్తుంటే, ఇప్పుడు జరుగుతున్నవి గ్రేటర్ ఎన్నికలు మాత్రమే కాదని, అంతకంటే ఎక్కువ అన్నట్లుగా అన్ని పార్టీలు బిల్డప్ ఇస్తున్నాయి.
ఒకరిపై ఒకరు మాటల తూటాలతో, గ్రేటర్ లో తమ సత్తా చాటుకునేందుకు ప్రత్యర్ధులపై విరుచుకుపడుతూ , ఈ ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తున్నాయి.ఇప్పటికే అన్ని పార్టీల ప్రచారం తో వాతావరణం వేడెక్కిస్తున్నారు.
ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ, ప్రజలలో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.అన్ని పార్టీలు ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ లను రంగంలోకి దించాయి.
అసలు గ్రేటర్ ఎన్నికలు అంటే, ఆ పరిధిలో మాత్రమే హడావుడి నడవాల్సి ఉన్నా, అన్ని పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలందరినీ ఎన్నికల ప్రచారంలో కి దించాయి.బీజేపీ కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులను, పక్క రాష్ట్రాలకు చెందిన బలమైన నాయకులను రంగంలోకి దించాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.ఈనెల 28వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.అదే రోజున ప్రధాని నరేంద్రమోదీ సైతం హైదరాబాద్ లో పర్యటించబోతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ ను సందర్శించబోతున్నారు.పనిలో పనిగా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనూ, పాల్గొన బోతున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
దీంతో ఈ గ్రేటర్ ఎన్నికలు బీజేపీ మరింత పతిష్టాత్మకంగా తీసుకుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
గ్రేటర్ లో జరగబోయే ఈ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ వంటి వారు హాజరు కావాల్సినంత అవసరం ఉందా అనే విషయం పైన ఇప్పుడు చర్చ జరుగుతోంది.
దక్షిణాదిలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఇప్పుడు తెలంగాణ పై పూర్తిగా ఫోకస్ పెంచింది అనే విషయం ఈ వ్యవహారం ద్వారా అర్థమవుతోంది.ప్రధాని కనుక గ్రేటర్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న, ఏదైనా విషయాన్ని అక్కడి నుంచి ప్రకటించి నా గ్రేటర్ వార్ మరింత రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు.