ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య వాడీవేడిగా రాజకీయ వైరం జరుగుతోంది.ఒకరిని ఇరుకున పెట్టే విధంగా మరొకరు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పై పైచేయి సాధించేందుకు తెలంగాణ బిజెపి వ్యూహాలను అమలు చేస్తోంది .కొద్ది రోజుల క్రితం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.తుక్కుగూడ లో భారీ బహిరంగ సభను బీజేపీ నేతలు ఏర్పాటు చేయగా, ఆ సమావేశంలో పాల్గొన్న అమిత్ షా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఆయన పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు.ISB కాన్వకేషన్ లో పాల్గొనేందుకు ఈనెల 26న ఆయన తెలంగాణకు రాబోతున్నారు.
అలాగే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని వర్చువల్ గా ప్రారంభిస్తారు.ఈ సందర్భంగా ఆయన కీలకాంశాలపై మాట్లాడే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో బిజెపి- టిఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నతరుణంలో ప్రధాని పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.కాని మోదీ హైదరాబాద్ పర్యటనలో ముందుగా తెలంగాణ బిజెపి నాయకులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారట.దీంతో తెలంగాణ బిజెపి నాయకులకు ప్రధాని ఏ విషయాలను చెప్పబోతున్నారు.
ఆయన పర్యటన తర్వాత తెలంగాణ బిజెపి నాయకులు ఏ స్థాయిలో యాక్టివ్ అవుతారనేది టిఆర్ఎస్ వర్గాలు అంచనా వేసే పనులు ఉన్నాయి.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమవిగా చెప్పుకుంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధి పొందుతుందని ఇప్పటికే కేంద్ర బిజెపి పెద్దలు తెలంగాణ బిజెపి నాయకులకు సూచించారు.ఈ అంశాలపైనే టీఆర్ఎస్ కు గట్టి కౌంటర్ ఇచ్చే విధంగా ప్రధాని ప్రయత్నిస్తారని సమాచారం.అలాగే రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయం పైన తెలంగాణ బీజేపీ నేతలతో ప్రధాని చర్చించే అవకాశం ఉన్నట్లు గా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.