ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా స్కూల్స్ అన్నీ కూడా గత మూడు నెలల నుంచి మూసివేసే ఉన్నాయి.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఈ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండడం తో మరో రెండు మూడు నెలల వరకు పాఠశాలలు తెరవకూడదు అని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి.అయితే అన్ని రాష్ట్రాలకు విరుద్ధంగా యూపీ సర్కార్ పాఠశాలల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.
జూలై 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని యూపీ సర్కార్ ప్రకటించింది.
అయితే ఇందులో ఒక చిన్న మార్పు ఉంది.
జులై 1 నుంచి పాఠశాలలు తెరచినా విద్యార్థులు మాత్రం హాజరు కారట.ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు మాత్రమే స్కూల్స్ కు హాజరు కావాలని యూపీ సర్కార్ పేర్కొంది.
ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రాథమిక విద్య డైరెక్టర్ జనరల్ విజయ్ కిరణ్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులకు కొన్ని పనులు అప్పగించింది.
శారదా అభియాన్ కింద 6 నుంచి 14 ఏళ్ల పిల్లలను పాఠశాలలో చేర్పిచాల్సి ఉంటుంది.గ్రామాల్లో ఉపాధ్యాయులు పర్యటించి పిల్లల వివరాలను సేకరించి వారి కోసం విద్యా ప్రణాళికను సిద్ధం చేయాలి.
దీక్షా యాప్ ద్వారా నూతన అంశాలలో శిక్షణ పొందాల్సి ఉంటుంది.
వివిధ తరగతుల విద్యార్థులకు పుస్తకాలను అందజేయాలి.
విద్యార్థుల యూనిఫారాలకు సంబంధించిన పనులను చేపట్టాలి.ఇలా తదితర పనులను ఉపాధ్యాయులకు అప్పగిస్తూ స్కూల్స్ తిరిగి పునఃప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.
అయితే ప్రైవేటు పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.