అమెరికాలో నవంబర్ 3 న జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు కేవలం 13 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.ఈ క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీల అభ్యర్ధులు ఇరువురు హోరా హోరీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
అమెరికాలో సాంప్రదాయంగా వస్తున్న ఇరు అధ్యక్షుల మధ్య డిబేట్ లో సైతం పాల్గొన్న ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ డిబేట్ మొత్తాన్ని రచ్చ రచ్చ చేసేశారు.ముఖ్యంగా ప్రత్యర్ధిని మాట్లాడనివ్వకుండా చేయడంలో గాని, మాటల తూటాలు పేల్చడంలో కానీ దిట్టగా పేరున్న ట్రంప్ మొదటి డిబేట్ లో బిడెన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఇదిలాఉంటే
రెండవ డిబేట్ ట్రంప్ అనారోగ్య కారణాల రీత్యా నిర్వహించలేక పోయినా మొత్తానికి ఈ డిబేట్ కొనసాగడానికి విశ్వప్రయత్నం చేశారు నిర్వాహకులు.దాంతో అతి త్వరలో మరో సారి ఇద్దరి అభ్యర్ధుల మధ్య డిబేట్ జరగనుంది.
అయితే త్వరలో జరగనున్న ఈ డిబేట్ కోసం కొత్త రూల్స్ ఇచ్చింది ప్రెసిడెన్షియల్ డిబేట్.ఎప్పుడు లేనట్లుగా ఈ కొత్త రూల్స్ తీసుకురావడం వెనుక తప్పకుండా బిడెన్ హస్తం ఉండే ఉంటుందని ట్రంప్ మద్దతు దారులు మండిపడుతున్నారు.
ఇంతకీ ఆ కొత్త రూల్స్ ఏమిటంటే.
డిబేట్ లో పాల్గొనే అభ్యర్ధులు ఇద్దరూ డిబేట్ లో తమకి ఇచ్చిన సమయాన్ని మాత్రమే వాడుకోవాలి, సమయం మించి మాట్లాడితే మైక్ కట్ చేస్తామని ప్రకటించారు.
అంతేకాదు మాట్లాడే సమయంలో పరుషమైన వ్యాఖ్యలు చేసినా, మాట్లాడే వారికి అవాంతరాలు సృష్టించినా సరే మైక్ కట్ చేస్తామని తెలిపారు.ట్రంప్ బిడెన్ ల మధ్య జరిగిన మొదటి చర్చలో ట్రంప్ ప్రతీ సారి బిడెన్ మాట్లాడే సమయంలో అవాంతరం సృష్టించారని, అందుకే ఇలాంటి రూల్స్ పెట్టాల్సి వచ్చిందని ప్రెసిడెన్షియల్ తెలిపింది.
ఎదుటి వారిని మాట్లాడనివ్వకుండా చేయడం, అలాగే ఎదురు దాడి చేసి నోరు మూయించడంలో దిట్టగా పేరున్న ట్రంప్ కి ఈ తాజా డిబేట్ రూల్స్ ఇబ్బందిని కలిగిస్తాయనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు.