షర్మిల పార్టీలో ఆధిపత్య పోరు ముదిరినట్టుగా కనిపిస్తోంది.ఇంకా పార్టీ పూర్తిస్థాయిలో పుంజుకోక ముందే అప్పుడే లుకలుకలు బయటపడుతున్నాయి.
ఒక్కో కీలక నేతా బయటకు వెళ్ళి పోతూ ఉండటం, పెద్దగా చేరికలు ఆ పార్టీ వైపు లేకపోవడం, ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి.తెలంగాణలో బలమైన అధికార పార్టీ గా ఉన్న టిఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్ వంటివాటిని ఎదుర్కొంటూనే అధికారంలోకి రావాలని షర్మిల చూస్తుండగా, ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకునే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్న తరుణంలో నాయకులు వరుసగా రాజీనామాలు చేసేందుకు, పార్టీని వీడి బయటకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండటం షర్మిలకు ఇబ్బందికరంగా మారింది.
తాజాగా వైస్సార్ టిపి కి చేవెళ్ల ప్రతాప్ రెడ్డి రాజీనామా చేశారు.షర్మిల పార్టీలో కీలక నాయకుడు, ఆమెకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన రాఘవ రెడ్డి వ్యవహార శైలి కారణంగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు రాజీనామా పత్రాన్ని ఆయన పార్టీ కార్యాలయానికి పంపించారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వైఎస్సార్ టీపి కి ప్రతాప్ రెడ్డి ఇన్చార్జిగా ఉన్నారు.
అనేక మంది నేతలు రాఘవ రెడ్డి వ్యవహార శైలిపై షర్మిలకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతూ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు చూస్తుండడంతో ఈ ప్రభావం పార్టీలో చేరాలనుకున్న నేతలపై పడుతుందని, పార్టీలో ఈ తరహా వ్యవహారాలు తమకు ఇబ్బందులు తెచ్చిపడతాయి అనేది షర్మిల అభిప్రాయంగా కనిపిస్తోంది.అందుకే పార్టీ లో ఎవరెవరు ఏయే కారణాలతో అసంతృప్తులకు గురవుతున్నారు అనే విషయంపై షర్మిల దృష్టి పెట్టాలని ఇక ఎవరు పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లకుండా చూడాలని అలెర్ట్ అయినట్టు గా తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ అంతటా నిరుద్యోగ దేశ చేపడుతూ, పట్టు పెంచుకుంటున్న సమయంలో ఈ పరిణామాలు చేటు తెస్తాయని భయం షర్మిల లో నెలకొంది.